ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ప్రత్యేక స్థానం ఉన్న అమెరికా.. అభివృద్ధి దశలో ఉన్న భారత్కు అప్పు ఉంది. ఆర్థిక అవసరాల కోసం వివిధ దేశాల వద్ద అప్పులు చేసిన అమెరికా, భారత్కు 216 బిలియన్ డాలర్లు బాకీ ఉంది. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యుడు అలెక్స్ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు అమెరికా 27.9 ట్రిలియన్ డాలర్లు బాకీ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని వ్యతిరేకిస్తూ మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో అప్పులు రెండింతలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితి చేజారే స్థితికి చేరుకుంది. కాబట్టి ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించండి. జపాన్, చైనాలకు ఒక్కో ట్రిలియన్ డాలర్ల చొప్పున బాకీ ఉన్నాము. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. పరిస్థితి కూడా అదుపు తప్పింది. సగటున ఒక్కో అమెరికన్ 84వేల డాలర్లకు పైగా బాకీ ఉన్నాడు."
-అలెక్స్ మూనీ, చట్టసభ్యుడు
2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం ఉన్న అప్పుల వ్యయం ప్రకారం 2050 నాటికి అమెరికా బాకీ.. 104 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనేది కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా.
ఇదీ చదవండి : 'అమెరికన్ల జోలికి వస్తే ఊరుకోం'- ఇరాన్కు బైడెన్ వార్నింగ్