అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అధికారులపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధించేలా కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అఫ్గానిస్థాన్లో యుద్ధ నేరాలకు సంబంధించి అమెరికా దళాలు, నిఘా అధికారులను తమ అనుమతి లేకుండానే విచారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విచారణతో ప్రత్యక్షంగా సంబంధమున్న ఐసీసీ అధికారులపై ఆంక్షలు వర్తింపజేయనున్నారు.
తమ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ సంస్థలపై చర్యలకు ఉపక్రమిస్తూ వస్తున్నారు ట్రంప్. పలు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాకే పారిస్ ఒప్పందం సహా ఇరాన్ అణు ఒప్పందం, రష్యాతో రెండు ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్య, ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థలను వీడింది. ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ నుంచి వైదొలుగుతామని బెదిరింపులకు దిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందించబోమని ప్రకటించింది. యుద్ధ నేరాలకు జవాబుదారీగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపైనా చర్యలకు దిగుతోంది.
అందుకే ఆంక్షలు..
ఐసీసీ చర్యలు అమెరికా పౌరుల హక్కులు, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కల్గించేలా ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కేలీ మెక్ఎనానీ. జవాబుదారీగా ఉండాల్సిన ఐసీసీ.. అమెరికా, దాని మిత్రదేశాల సిబ్బంది లక్ష్యంగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు.
ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి ఐసీసీ అధికారులపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధించేందుకు అధికారం లభిస్తుంది. అమెరికా బలగాలు, నిఘా వర్గాలకు సంబంధించిన విచారణతో ప్రత్యక్షంగా సంబంధాలున్న ఐసీసీ అధికారులు ఎవరూ అమెరికాలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అధికారుల కుటుంబ సభ్యులకూ ఇది వర్తిస్తుంది.
సంస్కరణలు చేపట్టాలని ఐసీసీని అమెరికా, దాని మిత్ర దేశాలు ఎన్ని సార్లు సూచించినా ప్రయోజనం లేకపోయిందని మెక్ఎనానీ తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే అమెరికా, ఇజ్రాయెల్పై దర్యాప్తు కొనసాగిస్తోందని ఆరోపించారు.