పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలను అరికట్టే దిశగా ఇమ్రన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమెరికా మరోమారు హితవు పలికింది. పాకిస్థాన్ స్థావరంగా జరగుతున్న ఉగ్ర దాడులను అరికట్టి.. ప్రాంతీయ సుస్థిరతను సాధించాలని సూచించింది అగ్రరాజ్యం.
ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ను గతంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది ఐరాస. అయితే తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. కనీస అవసరాల కోసం డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించాలని పాక్ను ఆశ్రయించాడు సయీద్.
ఈ నేపథ్యంలో సయీద్ బ్యాంకు ఖాతాలపై ఉన్న ఆంక్షలు సడలించాలని ఐరాస భద్రతా మండలి అనుమతి కోరింది పాక్. అందుకు ఐరాస అంగీకారం తెలుపుతూ.. ఉగ్రవాదాన్ని అరికట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలన్నారు అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి ఆలీస్వెల్స్.