కమలా హ్యారిస్... భారత సంతతి అమెరికా సెనెటర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న నేత. ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలు, ప్రచారం ముమ్మరం అవుతున్న వేళ... ఆమె కాసేపు సరదాగా గడిపారు. మసాలా దోశ వేశారు. దక్షిణ భారత దేశ మూలాల్ని గుర్తుచేసుకున్నారు.
మిండీతో కలిసి...
అమెరికాలో ప్రఖ్యాత కమెడియన్, నటి, రచయిత మిండీ కలింగ్తో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు కమల. ఇందుకు లాస్ ఏంజిల్స్లోని మిండీ నివాసం వేదికైంది.
మిండీ అసలు పేరు వీర మిండీ చొకలింగం. ఆమె కూడా భారత సంతతి వ్యక్తి. కమలది చెన్నై. అందుకే దక్షిణ భారత దేశ వంటకమైన మసాలా దోశను ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి కూరగాయలు కోసి, మసాలా తయారు చేసి... రుచికరమైన దోశలు వేశారు.
ఈ వీడియోను కమల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా... మంచి స్పందన లభిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దోశల రాజకీయం!
డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవాలని ఆశిస్తున్నారు కమల. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
మసాలా దోశ తయారీ కార్యక్రమంలో ఎక్కడా రాజకీయాలు ప్రస్తావించలేదు కమల. కానీ అంతర్లీనంగా జరిగింది మాత్రమే ప్రచారమే.
వలసదారుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రత్యర్థుల ప్రధాన విమర్శ. ఇక్కడ కమల, మిండీ ఇద్దరూ వలసదారుల కుటుంబాలకు చెందిన వారే. మసాలా దోశ వేస్తున్నంత సేపు వారు... దక్షిణ భారత దేశంతో వారికి ఉన్న అనుబంధం గురించి, తమ కుటుంబం వలస రావడం గురించి, ఇతర వలసదారుల కథల గురించి చర్చించుకున్నారు. అలా ట్రంప్కు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ... అమెరికాలో అధిక సంఖ్యలో ఉండే వలసదారుల ఓట్లకు వల వేశారు కమల.
డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవలే దిగ్గజ వ్యాపారవేత్త మైకేల్ బ్లూమ్బర్గ్ ప్రకటించారు. ట్రంప్ను ఢీకొట్టాలంటే ముందుగా బ్లూమ్బర్గ్తో పాటు మరికొందరు డెమొక్రాట్ ఆశావహ అభ్యర్థుల్ని ప్రాథమిక ఎన్నికల్లో కమల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆమె ఏ మేర సఫలం అవుతారో వేచి చూడాలి.