2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరు, ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ చేసినన్ని ఆరోపణలు ఇప్పటివరకు ఏ అధ్యక్షుడూ చేసి ఉండరు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఫలితాలు మార్చేశారని, తానే విజయం సాధించానని.. ఇలా ఓటమిని ఒప్పుకోకుండా ట్రంప్ చేసిన హడావుడికి ప్రపంచం ముందు అభాసుపాలయ్యారు. ఇక చివరగా ఎన్నికల వివాదాలను పరిష్కరించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ మాజీ మంత్రులు 10 మంది ఆరోపించారు. అలాంటి పనులకు పాల్పడవద్దని ట్రంప్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. వాషింగ్టన్ పోస్ట్లో వీరి పేరు మీద వ్యాసం ప్రచురితమైంది.
"ప్రశ్నలు, ఫలితాల సమయం అయిపోయింది. ఇక మిగిలింది పద్ధతి ప్రకారం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లెక్కించి ప్రకటించడమే. ఇలాంటి సమయంలో అమెరికా సైనిక బలగాలను ఎన్నికల వివాదాల్ని పరిష్కరించేందుకు వినియోగించాలనుకోవడం చాలా ప్రమాదకరం, చట్ట వ్యతిరేకం. ఎవరైనా సైన్యాధికారులు ఇందుకు ఆదేశించినా, పనిచేసినా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నేరపరమైన దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుంది."
- వాషింగ్టన్ పోస్ట్ కథనం
అధ్యక్ష ఫలితాల్లో గెలుపు ఎవరిదో ఇప్పటికే తేలిందని ట్రంప్.. జనవరి 20న అధికార మార్పిడికి సహకరించాలని వారు కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్రంప్ చేసిన ఆరోపణలను జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే సహా పలువురు రక్షణ అధికారులు ఇప్పటికే ఖండించారు. అమెరికా అధ్యక్షుడి ఫలితాల విషయంలో జోక్యం చేసుకునే అధికారం సైన్యానికి లేదని బహిరంగంగా తెలిపారు. బలగాలు రాజ్యాంగానికి మాత్రమే బద్ధులని... ఏ నాయకుడికి, పార్టీకి కాదని తేల్చిచెప్పారు.
సజావుగా జరగాలి..
తదుపరి అధ్యక్షుడు జో బైడెన్కు అధికారాన్ని అప్పజెప్పే ప్రక్రియ సజావుగా జరిగేలా ట్రంప్ వ్యవహరించాలని ఈ 10 మంది సూచించారు.
ట్రంప్ నియమించిన పెంటగాన్ అధికారులు అధికార మార్పిడి ప్రక్రియకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బైడెన్ ఇప్పటికే ఆరోపించారు.
ఇరాన్తో జాగ్రత్త..
ఇరాన్ అత్యున్నత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా బలగాలు హతమార్చి ఆదివారానికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే ఈ చర్యకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని ఇరాన్ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని మాజీ మంత్రులు ట్రంప్కు సూచించారు. అయితే ఇరాన్.. అమెరికాపై దూకుడుగా వ్యవహరిస్తే సైనిక ఆపరేషన్కు తాము వెనుకాడబోమని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు.