ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో గజగజలాడుతుంటే కొన్ని ప్రమాదకర శక్తులు ఈ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ తదితర ఉగ్రవాద సంస్థలు కొవిడ్ విజృంభణను ఆసరాగా చేసుకుని కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ- యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (యూఎన్ఐసీఆర్ఐ) నివేదికలో పేర్కొంది. ఇందుకుగాను ఆ సంస్థలు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నట్లు తెలిపింది.
కరోనా బాంబులుగా..
'కొవిడ్ మహమ్మారిని జీవాయుధంగా ఉపయోగించే ప్రయత్నాల్లో తీవ్రవాద సంస్థలున్నట్టు యూఎన్ఐసీఆర్ఐ హెచ్చరించింది. 'జీవ బాంబులు'గా తయారయేందుకు ఆయా సంస్థల సభ్యులు తమకు తామే కరోనా సోకేలా చేసుకుంటున్నారని నివేదికలో తెలిపింది. ఇక కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందేందుకు గాను బహిరంగంగా తుమ్మటం, దగ్గటం వంచి చర్యలకు పాల్పడేలా ఈ తీవ్రవాద సంస్థలు తమ సభ్యులను ప్రోత్సహిస్తున్నాయని ఈ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఉగ్రవాద సంస్థలు తమ నెట్వర్క్ను బలోపేతం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాలను వాడుతున్నాయని యూఎన్ఐసీఆర్ఐ తెలిపింది.