అంతరిక్షంలో ఓ గ్రహశకలం(ఆస్టరాయిడ్) భూమి వైపు ప్రయాణిస్తోందని నాసా వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశం 0.41 శాతం ఉందని అంచనా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నవంబర్ 3కు ఒక్క రోజు ముందు ఇది భూమిని తాకొచ్చని అభిప్రాయపడింది.
ఈ ఆస్టరాయిడ్ను 2018వీపీ1గా పేర్కొంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. దీని వ్యాసం ఆరున్నర అడుగులు ఉందని తెలిపారు.
కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీలో 2018 సంవత్సరంలో ఈ ఆస్టరాయిడ్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అబ్జర్వేటరీలో 12.968 రోజుల వ్యవధిలో 21 సార్లు పరిశీలించిన డేటా ఆధారంగా గ్రహశకలం ప్రభావం అంతగా ఉండదని నిర్ధరించారు.
ఇప్పటికే ఒకటి..
గత వారాంతంలో కారు సైజు ఉన్న ఓ గ్రహశకలం భూమికి సమీపానికి వచ్చి వెళ్లినట్లు నాసా వెల్లడించింది. దక్షిణ హిందూ సముద్రానికి 2,950 కిలోమీటర్ల పైనుంచి ఈ ఆస్టరాయిడ్ వెళ్లినట్లు ధ్రువీకరించింది.
ఇదీ చదవండి-భూమికి అత్యంత సమీపానికి వచ్చిన గ్రహశకలం