బిహార్కు చెందిన ప్రముఖ భోజ్పురి జానపద గాయని నిషా ఉపాధ్యాయ్కు లైవ్ జరగుతున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెపై ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె స్టేజీపైనే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమెను పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. సరన్ జిల్లా జనతా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందుర్వ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడం వల్ల పోలీసులు స్పందించారు.
ఈ ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని.. తాము కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలుసుకున్నామని జనతా బజార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నస్రుద్దీన్ ఖాన్ వెల్లడించారు. నిషా ఉపాధ్యాయ్ వేదికపై పాట పాడుతుండగా అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై గన్తో కాల్పులు జరపగా.. ఆమె ఎడమ తొడకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనపై నిషా ఉపాధ్యాయ్ కుటుంబ సభ్యులు మాత్రం స్పందించేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపింది ఎవరు? అసలు ఆమెను ఎందుకు గాయపరిచారన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు.
బిహార్ సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ గ్రామానికి చెందిన నిషా ఉపాధ్యాయ్ భోజ్పురి సింగర్గా ఎంతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పట్నాలో నివాసం ఉంటున్నారు. ఈమె తరచుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు. 'ధోలిదా ధోల్ రే వగడ్', 'హసి హసి జాన్ మారెలా', 'లే లే ఆయే కోకా కోలా', 'నవకర్ మంత్ర' వంటి ఎన్నో హిట్ సాంగ్స్ను ఈమె పాడారు.
స్పందించిన మంత్రి!
ఈ ఘటనను బిహార్ సాంస్కృతిక శాఖ మంత్రి జితేంద్ర కుమార్ రాయ్ ఖండించారు. బహిరంగ సభలు, మతపరమైన వేడుకలు, పెళ్లిళ్లు సహా ఇతర కార్యక్రమాల్లో లైసెన్స్ పొందిన గన్లతో కాల్పులు జరపడం చట్టరీత్యా నేరమని ఆయన గుర్తుచేశారు. ప్రజలు దీనిని గమనించాలని ఆయన కోరారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. కాగా, సెలబ్రిటీలపై దాడులు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయని. తరచూ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సినీ, రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా నటీమణులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.