Actress Aishwarya Selling Soaps: ఒకప్పుడు ఆమె స్టార్ స్టేటస్ ఉన్న నటి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఇంత నేపథ్యం ఉన్న ఆ నటి ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక పొట్టకూటి కోసం సబ్బులు అమ్ముతున్నారు. వీధుల్లో ఇంటింటికీ తిరిగి సబ్బులు అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.
ప్రముఖ నటి లక్ష్మీ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో వచ్చిన 'అడవిలో అభిమన్యుడు' సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు. కెరీర్లో దాదాపు 200 వరకు సినిమాలు చేసినా ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేదు. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు. అలాగని అప్పులేమీ లేవు. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదానినే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను సంకోచించను. రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా వచ్చి చేస్తా. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా.'
- ఐశ్వర్య, నటి
"సినిమాల్లో సంపాదించిన డబ్బును నేనేమీ తాగడానికి ఖర్చు చేయలేదు. అంతా ఫ్యామిలీ కోసమే ఖర్చు చేశాను. నేను నటించడం ప్రారంభించాక మూడేళ్ల పాటు కెరీర్ బాగా సాగింది.. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత క్రమంగా నేను సినీ ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. నేను ఇండిపెండెంట్గా ఉన్నందుకు నా కూతురు చాలా గర్వపడుతుంది." అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్య ఉన్నారని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఇవీ చదవండి: 'అవన్నీ రూమర్స్.. ప్రభాస్ను అలాంటి పాత్రలోనే చూపిస్తా'
'20 దేశాలు తిరిగా.. 6 వేల షోస్ చేశా.. కానీ జబర్దస్త్కు వచ్చాక..'