యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైదాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొరేగావ్ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్ కాలనీలో నివసిస్తోంది. అతని కుమారుడు అరుణ్ కుమార్(24) పంజాగుట్టలోని పీవీఆర్ మాల్లో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం విధులకు పంపేందుకు కుటుంబ సభ్యులు లేపే ప్రయత్నం చేయగా అతను లేవలేదు. తమ కుమారుడికి ఏమైందోనన్న భయంతో 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు.
వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అప్పటికే అరుణ్ చనిపోయాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు... మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దారుణం: భార్యను హతమార్చిన భర్త