కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలో లారీ కింద పడి వృద్ధుడు మృతిచెందాడు. నవేగం గ్రామానికి చెందిన నారాయణ పటేల్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం మామిడికాయలు అమ్మేందుకు సిర్పూర్ టి మండల కేంద్రానికి వచ్చాడు. దాహం వేయడంతో రోడ్డు దాటి నీళ్లు తాగి వస్తుండగా అటుగా వస్తున్న బోర్ వెల్ లారీకి వెనక వైపు తగిలాడు.
తలకు తీవ్రగాయమవడం వల్ల స్థానికులు హుటాహుటిన సిర్పూర్ టి సామాజిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కాగా మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నారాయణ పటేల్ గతంలో సర్పంచ్గా పనిచేశాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.