ఈ నెల 14న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో ముగ్గురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. మద్యంలో సైనెడ్ కలిపి ముగ్గురిని చంపినట్లు పోలీసులు నిర్ధరించారు. పాత కక్షలతోనే వారిపై విష ప్రయోగం జరిగిందని తేల్చారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు.
హత్యల కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 14న దశదిన కర్మకు హరిదాసు, మల్సూరు, భద్రును ఆహ్వానించి నిందితులు హత్యకు కుట్ర పన్నినట్లు సీపీ వివరించారు. వారికి మద్యంలో సైనెడ్ కలిపి ఇచ్చినట్లు చెప్పారు.
ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా కుటుంబంతో మృతుల కుటుంబీకులకు గత ఆరేళ్లుగా విబేధాలున్నాయి. భూ సమస్యలపై స్థానిక పీఎస్లలో పలు కేసులూ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే సైనెడ్ కొని గతేడాది నుంచే వారిని చంపాలని పలుసార్లు పథకం పన్నారు. విఫలం కావడంతో పెద్ద కర్మకు పిలిపించి మద్యంలో సైనెడ్ కలిపి ఇచ్చారు. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. -విష్ణు వారియర్, ఖమ్మం సీపీ
అసలేం జరిగింది.?
చంద్రుతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్ పది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు ఈ నెల 14న పెద్ద కర్మ నిర్వహించారు. బంధువులు, తండావాసులకు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది భోజనాలు చేశారు. అయితే సమీప బంధువులైన బోడ హరిదాసు, బోడ మల్సూరు, బోడ భద్రుతో పాటు మరో నలుగురు.. వ్యవసాయ పనులకు వెళ్లడం వల్ల మధ్యాహ్నం విందుకు హాజరు కాలేదు. సాయంత్రం విందుకు వెళ్లిన వారికి మద్యం ఏర్పాటు చేశారు. మద్యం తాగిన వారిలో ముగ్గురు కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు ముగ్గురు ప్రాణాలు విడిచారు.
ఏడుగురు తింటే.. ముగ్గురు మృతి
బోడ హరిదాసు, బోడ భద్రు మార్గమద్యంలో మృత్యువాతపడగా... మల్సూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలో మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విందుకు మొత్తం ఏడుగురు వెళ్లగా ముగ్గురు మృతి చెందారు.
ఇదీ చదవండి: MURDER: తండ్రినే హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే!