Fake Jobs : వారంతా చదివింది పదో తరగతి, ఇంటర్ మాత్రమే.. అయితే, బీటెక్, ఎంటెక్ పూర్తిచేసిన వారికి ఇంటర్వ్యూలు చేస్తూ, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. దిల్లీ కేంద్రంగా నకిలీ కాల్సెంటర్లను ఏర్పాటుచేసి నిరుద్యోగులను మోసగిస్తున్న రెండు నకిలీ కాల్సెంటర్లపై భాగ్యనగర సైబర్క్రైమ్ పోలీసులు దాడి చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నగర సీసీఎస్ కార్యాలయంలో సోమవారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ఎంప్రసాద్తో కలసి నగర సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ గజరావు భూపాల్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
Fake Interviews : ఉత్తర్ప్రదేశ్కు చెందిన నితికుమార్(28), కరణ్కోహ్లి(27), రాహుల్ కుమార్ అలియాస్ రాహుల్ వర్మ(28), ప్రతీక్ మన్వర్ అస్వాల్(32) స్నేహితులు. పదోతరగతి, ఇంటర్ చదివిన వీరంతా ముఠాగా మారారు. 6 నెలల క్రితం దిల్లీ, ఘజియాబాద్లో నకిలీ కాల్సెంటర్లు ఏర్పాటుచేసి 16 మంది టెలీకాలర్స్ను నియమించారు. ఉద్యోగావకాశాల కోసం జాబ్పోర్టల్స్కు పంపిన యువతీ, యువకుల వేలాది రెజ్యూమెలను వారు కొనుగోలు చేశారు. మోసాలు ప్రారంభించారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఫోన్ చేసి తేలికగా నమ్మించేవారు. మంచి ఉద్యోగాలు, మంచి ప్యాకేజీతో ఇప్పిస్తామంటూ ఉత్తుత్తి ఇంటర్యూలు నిర్వహించి, అభ్యర్థుల మెయిల్స్కు అపాయింట్మెంట్ లెటర్లూ పంపేవారు. రుసుముల పేరిట ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష నుంచి 3 లక్షల వరకూ బ్యాంకు ఖాతాల్లో జమచేయించుకునేవారు.
ఎలా బయటపడిందంటే.. షెల్ పీఎల్సీ ఇండియా కంపెనీలో జీఎం పోస్టు ఖాళీగా ఉందంటూ నల్లకుంటకు చెందిన యువకుడి మెయిల్కు సమాచారం వచ్చింది. వార్షిక వేతనం రూ.69 లక్షలంటూ అపాయింట్మెంట్ లెటర్ పంపారు. ఆసక్తి చూపిన అతడి నుంచి రూ.5,49,220 డిపాజిట్ చేయించుకున్నారు. ఐటీ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం వచ్చిందంటూ గాంధీనగర్కు చెందిన యువతి నుంచి రూ.1,73,650 కొట్టేశారు. బాధితులు తాము మోసపోయినట్టు గ్రహించి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ సారథ్యంలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, బృందం దిల్లీ, ఘజియాబాద్ల్లోని నకిలీ కాల్సెంటర్ల గుట్టు బట్టబయలు చేశారు.