రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు రాజు కోసం వందల మంది పోలీసులు జల్లెడపడుతున్నారు. అత్యాచారం జరిగి ఆరు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి... మూడు కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను ఇప్పటికే అప్రమత్తం చేశారు.
ముమ్మర గాలింపు
టాస్క్ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి నగరంలోని అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నిందితుడు రాజుకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 9న సాయంత్రం చిన్నారిని అత్యాచారం చేసి... అక్కడి నుంచి పారిపోయి రాజు 10వ తేదీ ఉదయం మందమల్లమ్మ గార్డెన్ సమీపంలో సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సాయంత్రం వేళలో ఎల్బీనగర్లోని ఓ మద్యం దుకాణం వద్ద మద్యం సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
రివార్డు ప్రకటన
మద్యం దుకాణం నుంచి రాజు ఎక్కడికి వెళ్లాడు? అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, లేబర్ అడ్డాల వద్ద పోలీసులు గాలిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో ఉండే సీసీ కెమెరాలను కూడా పోలీసులు నిక్షిప్తంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు రాజు ఆచూకీ చెప్పిన వాళ్లకు రూ.పది లక్షల రివార్డు ఇస్తామని సీపీ అంజనీ కుమార్ ఇదివరకే ప్రకటించారు. రాజును వీలైనంత తొందరగా పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
అదే ఆటంకం..
నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే సాంకేతికత ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు. ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నగరంలో జల్లెడ పడుతున్న పోలీసులు
ట్యాంక్ బండ్ సహా ప్రతి పార్కును గాలిస్తున్న బృందాలు... రైల్వేస్టేషన్, బస్స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లలో జల్లెడపడుతున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు సైదాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా... వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడు రాజు గత కొన్ని నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు.
అదుపులో రాజు స్నేహితుడు
ఇప్పటికే నిందితుడు రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు. రాజు చేసిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం వీరిద్దరు తిరిగిన ప్రదేశాలలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తలను మాత్రం పోలీసు అధికారులు ఖండిస్తున్నారు.
ఉన్నతాధికారుల సమీక్ష..
చిన్నారి హత్యాచారం కేసులో పోలీస్ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. అదనపు డీజీ శిఖాగోయల్, సంయుక్త సీపీ రమేశ్ రెడ్డి, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తితో సీపీ అంజనీ కుమార్ సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లభించాయి..? కేసు ఎంత పురోగతి సాధించింది..? అన్న అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు.
ఇవీ చదవండి: