తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఓ మహిళ డబ్బులు పెట్టి మోసపోయింది. హైదరాబాద్ బాలానగర్కు చెందిన లక్ష్మీ అనే మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను పంపే లింక్ ద్వారా ‘లైటనింగ్ పవర్ యాప్’ డౌన్లోడ్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని కోరాడు. నమ్మిన లక్ష్మీ మొదట కొంత నగదు ఇన్వెస్ట్ చేయగా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చాయి.
అనంతరం ఆ వ్యక్తి మళ్లీ మహిళకు ఫోన్ చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందన్నాడు. ఈజీ మనీ ఆశతో లక్ష్మీ బంధువుల వద్ద అప్పు చేసి మరీ రూ.12.91 లక్షలు ఆ వ్యక్తి పంపిన యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది. అనంతరం ఆమె ఫోన్ చేస్తే నిందితుడు స్పందించకపోవడంతో లబోదిబోమంది. మోసపోయానని గ్రహించి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైజీరియా సైబర్ నేరస్థుల పనిగా భావించి దర్యాప్తు ప్రారంభించారు.