swimmer died in car in the well accident: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద బావిలో పడిన కారును వెలికితీసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడు నర్సింహులు మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. మోటర్లతో బావిలోని నీటిని బయటికి తోడేసి.. క్రేన్ సహాయంతో పైకి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా బంధువులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రఘునందన్రావు రావాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 6లక్షల పరిహారం, రెండు పడక గదుల ఇంటితో పాటు ఆయన భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్డీవో ఆనంతరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో బంధువులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు.
అసలేం జరిగిందంటే...
రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిలో చిట్టాపూర్, భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన బావి ఉంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకుమారుడు వేడుకలో పాల్గొని హుస్నాబాద్కు కారులో వెళ్తున్నారు. అప్పటివరకు వాళ్ల ప్రయాణం బాగానే సాగినా.. చిట్టాపూర్, భూంపల్లి మధ్య కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న ఓ స్థానికుడు చూశాడు. రోడ్డు మీది నుంచి ఘటనా స్థలానికి వచ్చేలోపే కారు పూర్తిగా బావిలో మునిగిపోవటంతో ఏమీ చేయలేకపోయాడు. బావిలోనూ నిండుగా నీరు ఉండటం వల్ల అతడూ ఎలాంటి సాహసం చేయలేకపోయాడు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అంతా.. బావి దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. జేసీబీ, క్రేన్ల సాయంతో కారును వెలికి తీసేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. అప్పటికీ కారులో ఎంత మంది ఉన్నారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. బావి లోతు సుమారు ఇరవై గజాలు.. నిండుగా నీరు ఉండటం వల్ల సహాయక చర్యలు కష్టంగా మారాయి. మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.
మంచి చేయాలని పోతే...
ఈ సహాయక చర్యల్లో గజఈతగాళ్లు కూడా పాల్గొన్నారు. క్రేన్కు ఉన్న తాడుని బావిలోపల ఉన్న కారుకు కట్టి బయటకు తీసేందుకు ప్రయత్నం. ఈ క్రమంలో గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. "మంచి చేయాలని వచ్చినా దురదృష్టం ముంచేసింది" అన్న సామెతా ఇక్కడ నిరూపితమైంది. కారును బయటకు తీసేందుకు వచ్చిన గజఈతగాళ్లలో ఒకరు సహాయకచర్యల్లో భాగంగా ప్రమాదవశాత్తు ప్రాణం వదిలాడు. గజఈతగాడైన నర్సింహులు.. బావిలోపలికి వెళ్లి కారుకు తాడు బిగించాడు. ఇక బయటికి లాగటమే తరువాయి. ఈ సమయంలోనే నర్సింహులు కారుకు చిక్కుకుపోయాడు. బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా.. విఫలయత్నమే అయ్యింది. బయటివాళ్లకేమో.. నర్సింహులు పరిస్థితి తెలియదు.. అతడికేమో బయటికి రావటానికి వీలుకావటం లేదు. ఈ పోరాటంలో నర్సింహులు కూడా ప్రాణాలు వదిలాడు.
ఇదీ చదవండి: బావిలోకి దూసుకెళ్లిన కారు : తల్లీకుమారుడితో పాటు గజఈతగాడు మృతి