Durga Temple EO On Bhavani Devotees: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విమరణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 25 నుంచి 29 వరకు దీక్ష విరమణకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో భ్రమరాంబ పూజ చేసి ప్రారంభించారు. కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద పూజలు చేసి క్యూలైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
5లక్షల మంది వస్తారని అంచనా..
క్యూలైన్లు, షామియానాలు, కొండపైన, దిగువన విద్యుత్తు అలంకరణ, సీసీ కెమెరాలు, ప్రత్యేక కేశఖండన శాల, ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు, హోమగుండాల నిర్మాణం, లడ్డూ విక్రయ కౌంటర్లు, స్నానఘట్టాలు తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. సుమారు ఐదు లక్షల మంది భక్తులు దీక్ష విరమణ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు.
7 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షణ..!
దీక్ష విరమించేందుకు వచ్చే భక్తులు ముందుగా ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు. దుర్గగుడి టోల్గేట్ వద్ద ప్రారంభమై.. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితార సెంటర్, మిల్క్ఫ్యాక్టరీ, చిట్టినగర్, రథం సెంటరు మీదుగా వినాయక గుడి వద్ద క్యూలైనులో కొండపైకి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షణలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉచిత ప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాలు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండి:
TTD Board Decisions: కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని టీటీడీ నిర్ణయం