దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం-2003 బిల్లును తెలంగాణ శాసనమండలి వ్యతిరేకిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తరఫున... తీర్మానాన్ని మంత్రి ప్రతిపాదించారు. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు-పేదల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. బిల్లు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి తీర్మానించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమైంది...? కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాలేదని...మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా ఇవ్వలే..
ప్రధాని నరేంద్ర మోదీతోనే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వచ్చిందన్న భాజపా నేతలు అన్న మాటలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ విజయాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంపై మండలిలో లఘు చర్చ జరిగింది. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉచిత కరెంట్ సాధ్యమైందన్నారు. దేశంలో విద్యుత్ ప్రమాదం జరిగిన ఏ రాష్ట్రంలోనూ కోటి రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందజేయలేదని... కేవలం తెలంగాణలో శ్రీశైలం ప్రమాద ఘటనలో మాత్రమే... కోటికిపైగా ఆర్థికసాయం అందించామన్నారు.
భాజపా వాకౌట్
శ్రీశైలం విద్యుత్ ఘటనపై విచారించి, బాధ్యులను శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. విద్యుత్ చట్టం విషయంలో ఉచిత విద్యుత్ను మొదట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. దాన్ని తెరాస కేవలం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్పై సంతకం మాత్రమే చేశారని... కరెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేంద్రాన్ని విలన్గా చూపించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రారావు ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టంతో రాష్ట్రాలు ఎటువంటి హక్కులు కోల్పోవని... రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. 2003 విద్యుత్ సవరణ బిల్లును తాను సమర్థిస్తున్నానని... ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని... తాను సభ నుంచి బైకాట్ చేస్తున్నట్టు... రాంచంద్రారావు సభ నుంచి వెళ్లిపోయారు.
త్వరలో వార్డు అధికారులు..!
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా... ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ బడ్జెట్ కేటాయింపులపై... ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలో రూ.67వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వెల్లడించారు. లాక్డౌన్లో హైదరాబాద్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 11వేల పబ్లిక్ టాయ్లెట్లను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలలో త్వరలోనే వార్డు అధికారుల నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. వారికి మొదటి మూడు సంవత్సరాలు ప్రొబేషన్ కాలం ఉంటుందన్నారు.
పురాతన కట్టడాలను కాపాడండి..
2021లోపు 71 మైనార్టీ పాఠశాలలను కళాశాలలుగా మార్చే ప్రతిపాదన చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో అక్టోబర్ 21 నుంచి ఆన్లైన్ తరగతుల నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పురాతన కట్టడాలకు ప్రభుత్వం మరమ్మతులు చేస్తామంటే కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని... పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వరంగల్లో ఉన్న రామప్ప, వెయ్యి స్తంభాల గుడి తదితర పురావస్తు కట్టడాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. వెయ్యి స్తంభాల ఆలయం రోజురోజుకు శిధిలావస్థకు చేరుకుంటుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. పురాతన కట్టడాలను కాపాడాలని, జూబ్లీహాల్ పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయని ఫారూక్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరెంత మాట్లాడారంటే..
శాసన పరిషత్ సభ కొనసాగిన తీరుపై రాష్ట్ర శాసన మండలి కార్యదర్శి నరసింహచార్యులు గణాంకాలు వెల్లడించారు. 8 రోజులపాటు జరిగిన సమావేశాలు... 22 గంటల 57 నిమిషాలపాటు కొనసాగింది. 32 ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారని... 12 బిల్లులను చర్చించి ఆమోదించినట్టు పేర్కొన్నారు. రెండు అంశాలపై లఘు చర్చ జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కలిపి 10గంటల 14 నిమిషాలు సభలో మాట్లాడారు. తెరాస సభ్యులు 6 గంటల 29 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యుడు 2గంటల 2 నిమిషాలు, భాజపా సభ్యుడు గంట 13 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు గంట 13 నిమిషాలు, పీఆర్టీయూ సభ్యుడు 31 నిమిషాలు, స్వతంత్ర, నామినేటెడ్ సభ్యులు గంట 15 నిమిషాలు మాట్లాడినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా