గత ఏడాది హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది వేల డెంగీ, మలేరియా, టైపాయిడ్ కేసులు వచ్చాయి. దీంతో సంబంధిత ఆస్పత్రి రోగులతో కిటకిటలాడిపోయింది. ఈ ఏడాది పరిస్థితి గత ఏడాదంత తీవ్రంగా లేకపోయినా కూడా గత కొద్ది రోజులుగా కేసులు సంఖ్య పెరిగింది. ఇప్పటికే 30 మంది వరకు వివిధ రకాల వ్యాధులతో ఈ ఆస్పత్రిలో చేరి వైద్యం పొందుతున్నారు. పగటిపూట దోమకాటుకు గురైతే సంబంధిత వ్యక్తికి డెంగీ వచ్చే అవకాశం ఉంది. చారలతో ఉండే దోమలు పగటిపూట అధికంగా సంచరిస్తాయి. ఈ దోమ కాటుకు ఎంతమంది గురైతే అంతమంది డెంగీ బారినపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. రాత్రిపూట సంచరించే దోమల బారినపడితే సంబంధితులకు టైపాయిడ్, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఈ లక్షణాలుంటే డెంగీనే!
డెంగీ బారినపడే వారిలో జ్వరం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కొందరిలో 103, 104 టెంపరేచర్ ఉంటుంది. తలనొప్పి చాలా తీవ్రస్థాయిలో వస్తుంది. ప్రధానంగా కనుగుడ్లు అటూఇటూ తిప్పినపుడు ఓర్చుకోలేని నొప్పి వస్తే మాత్రం సంబంధిత వ్యక్తి డెంగీ వ్యాధికి గురయ్యారని చెప్పవచ్చని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఒళ్లు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటుంది. విరోచనాలు, వాంతులు కూడా అధికంగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుని చికిత్సను పొందాలి. లక్షణాలు తీవ్రంగా ఉండి నాలుగైదు రోజులపాటు నిర్లక్ష్యంగా ఉంటే ప్లేట్లెట్స్ మెల్లగా పదివేలకు తగ్గిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు కూడా వైద్యం అందించపోతే ప్రాణాలకు మీదకు వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కంటితుడుపుగానే కట్టడి
గ్రేటర్లో దోమల సమస్య నానాటికీ పెరుగుతోంది. ప్రజలు రోగాలబారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా జీహెచ్ఎంసీ సరైన చర్యలు తీసుకోవట్లేదు. క్షేత్రస్థాయి సర్వేతో సమస్యాత్మక ప్రాంతాలను, హాట్ స్పాట్లను గుర్తించినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు నామమాత్రంగా ఉండమే అందుకు నిదర్శనం.
చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించట్లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎప్పటికప్పుడు గుర్రపుడెక్క తొలగించే ఏజెన్సీలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎంపిక చేసుకున్నాయి. బిల్లులూ చెల్లిస్తున్నాయి. గుత్తేదారులు మాత్రం గుర్రపుడెక్కను అలాగే వదిలేశారు.
డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో చుట్టూ వంద ఇళ్లలో ఏసీఎం పౌడరుతో తయారు చేసిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. క్షేత్రస్థాయిలో అలా జరగట్లేదు. ఫాగింగ్ చేసి వదిలిపెడుతున్నారు.
డ్రోన్లతో చెరువుల్లోని గుర్రపుడెక్కను తొలగించే కార్యక్రమం నిధుల మేతగా మారిందని, డెక్క తొలగించకుండా మందు చల్లుతున్నారని కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు.
నిర్మాణంలో ఉన్న ఇళ్లలో దోమలు భారీగా పెరుగుతున్నాయి. సెల్లార్ గుంతలు, కుంటల పక్కనున్న కాలనీల్లో తేనెటీగల్లా దాడి చేస్తున్నాయి. బల్దియా చర్యలు సరిగా ఉండటం లేదని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎంలో స్వైన్ప్లూ పరీక్ష
నారాయణగూడ ఐపీఎంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల నిర్ధారిత పరీక్షలు చేస్తున్నాం. ప్రధానంగా స్వైన్ప్లూకు సంబంధించి స్వాబ్ టెస్టును కూడా మొదలుపెట్టాం. గత ఏడాదిలా ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత గత నెల రోజుల వరకు పెద్దగా లేదు. ఇప్పుడిప్పుడే అనేకమంది సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో ఈ సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనూ ఇంటిపరిసరాల్లోనూ దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి.
ఇదీ చూడండి: Dengue: భాగ్యనగరంలో మోగుతున్న డెంగీ డేంజర్ బెల్స్