రాష్ట్రంలో గత నెల రోజులుగా నిత్యావసర సరకులు మినహా ఇతర అమ్మకాలు స్తంభించాయి. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలు నామమాత్రంగా ఉన్నాయి. మద్యం దుకాణాలను మూసివేయడంతో ఎక్సైజ్ ద్వారా అమ్మకం పన్ను పూర్తిగా రాలేదు. దీంతో పాటు పన్నుల చెల్లింపునకు కేంద్రం జూన్ వరకూ గడువు ఇవ్వడంతో అత్యధికం పన్నులు జమ చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు శూన్యం.
చివరి వారంపై మాత్రం లాక్డౌన్ ప్రభావం
మార్చి నెలలో వాణిజ్య పన్నుల శాఖకు 5 వేల కోట్ల రూపాయల రాబడి వచ్చింది. మొదటి మూడు వారాలు సాధారణ పరిస్థితి ఉండగా.. చివరి వారంపై మాత్రం లాక్డౌన్ ప్రభావం పడింది. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచీ లాక్డౌన్ వల్ల రాబడి నామమాత్రంగా ఉంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రతి నెలా 4 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మరో ఆరు రోజుల్లో నెల పూర్తవుతుండగా రూ.490 కోట్లు మాత్రమే వచ్చింది.
జీఎస్టీ రాబడి అంతంతమాత్రమే
ఏప్రిల్ నెలకు గాను శుక్రవారం వరకు రాష్ట్రంలో జీఎస్టీ రాబడి రూ.140 కోట్లుగా ఉంది. కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి ఏప్రిల్ నెలకు రూ.220 కోట్లు రాగా.. మరో రూ.130 కోట్లు పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం సహా ఇతరత్రా రూపంలో వచ్చింది. రాష్ట్రానికి నిర్దేశిత జీఎస్టీ రాబడులు రాకుంటే కేంద్రం ఆ మేరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
రూ.6.6 కోట్లు మాత్రమే..
కేంద్రానికి కూడా జీఎస్టీ రాబడులు నామమాత్రం కావడంతో తొలివిడత పరిహారాన్ని కొంత మేర మాత్రమే ఇచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడి, సగటున రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు రూ.830 కోట్లకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో ఇప్పటిదాకా కేవలం రూ.6.6 కోట్లు మాత్రమే వచ్చింది. లాక్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్లు దాదాపు నిలిచిపోయాయి.
బాండ్లు, ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి
పన్ను రాబడులపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రూపాల్లో నిధులను సమీకరించుకోవడంపై కార్యాచరణ అమలు చేస్తోంది. ఏప్రిల్ నెలలో బాండ్ల విక్రయం ద్వారా రూ.3000 కోట్లను సమీకరించుకోవాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించగా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రూ.4000 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా సిద్ధం చేసుకుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా 980 కోట్ల రూపాయలు వచ్చింది.
లాక్డౌన్ ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్ర వాటాగా రూ.245 కోట్లను ఇచ్చింది. ఏప్రిల్ నెలాఖరుకు వేతనాలు సహా అనేక చెల్లింపుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇవీ చూడండి: కరోనాపై సైంటిస్ట్లకే ట్రంప్ సలహా.. కానీ మళ్లీ!