పిల్లులు, కుక్కలు వంటి జంతువులను పెంచుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అమితంగా పెంచుకునే పెట్లకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కొంతమంది యజమానులు తట్టుకోలేరు. తక్షణమే వాటిని ఆసుపత్రికి తీసుకొస్తారని వెటర్నరీ వైద్యులు తెలిపారు. పెట్ల సంరక్షణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు సైతం వెనకాడరని చెబుతున్నారు. అయితే తక్కువ ఖర్చుతో పెంపుడు జంతువులకు చికిత్స అందించడానికి.. ఇప్పుడు పెట్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. కేవలం విదేశాల్లోనే ఉన్న ఈ విధానం.. ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే సుమారు 50 మంది జంతు ప్రేమికులు ఇన్సూరెన్స్ను చేయించారు.
అందుబాటులోకి వివిధ ప్రీమియం ప్లాన్లు..
బీమా చేయించే సమయంలో ఆ పెంపుడు జంతువుకు వెటర్నిటీ సర్టిఫికెట్తో పాటు మెడ భాగంలో మైక్రోచిప్ను అమర్చుతారు. చిప్ను స్కాన్ చేస్తే.. వివరాలు అన్నీ తెలిసేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ఇన్సూరెన్స్లు.. మూడు ప్రీమియంలలో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. రూ.1,460 నుంచి రూ.15 వేల వరకు ఇన్సూరెన్స్లు అందుబాటులో ఉన్నాయి. బీమా ఉన్న పెంపుడు జంతువులకి తక్కువ ఫీజు వసూలు చేస్తున్న తరుణంలో యజమానులు ఆసక్తి కనబరుస్తున్నారని నిర్వహకులు తెలిపారు. ప్రారంభ ప్రీమియం చెల్లిస్తే.. రూ.40వేల వరకు బీమా వర్తిస్తోందంటున్నారు. రూ.15 వేలు చేల్లించిన పెట్లకు రూ.లక్షా 50 వేల వరకు వస్తోందని వివరించారు
పాటెక్, బజాజ్ అలయన్స్, కెనైన్ కేర్ సంస్థలు ప్రస్తుతం ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి.
ఇవీ చూడండి: '11 తేదీకి జీతాలు రాకపోవడం ఆర్టీసీ చరిత్రలోనే ప్రథమం'