ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కొవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క నానా అవస్థలకు గురవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు కరోనా ఆసుపత్రికి వచ్చేవారికి చాలినన్ని పడకలు లేక, నేలమీద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు ఉండటం వల్ల.. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరినీ అక్కడికి తరలించి వైద్యం అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం, కేసులు పెరిగిపోవటం వల్ల.. కొవిడ్ రోగులతో ఒంగోలు జీజీహెచ్ కిటకిటలాడుతోంది. ఆసుపత్రిలో ఉన్న వెయ్యి పడకలు నిండిపోయి.. కొత్తగా వచ్చేవారికి బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్నారు.
సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకొని..
బెడ్లు దొరకనివారు ఓపీ వద్ద, చెట్ల నీడన, ఆ పక్కనే ఉన్న షెడ్డులో నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారిలో ఊపిరాడని పరిస్థితి ఉన్న రోగులు.. సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుని బెడ్డు ఎప్పుడు దొరుకుతుందా అని పడిగాపులు పడుతున్నారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక, కింద పడుకోలేక యాతన అనుభవిస్తున్నారు. రోగులతోపాటు వచ్చిన బంధువులు, అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వచ్చిన వారితో జీజీహెచ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఇదీ చదవండి: ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్