అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లో భవనాలు కూల్చవద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి. నిన్నటి ఆదేశాల మేరకు ఆర్అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. అసెంబ్లీని ఎలా నిర్మించబోతున్నారని గణపతిరెడ్డిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. భవన నిర్మాణ ప్లాను ఇంకా ఖరారు కాలేదని ఈఎన్సీ తెలిపారు. వివిధ ప్రణాళికలు, నమూనాలపై కసరత్తు కొనసాగుతోందని నివేదించారు.
ఎంత స్థలం అవసరం
ఎంత స్థలం అవసరం... ఎలా ఉండాలని భావిస్తున్నారో కనీస అంచనా ఉంటుంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. సుమారు 25 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నట్లు గణపతి రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ, శాసనమండలి, సెంట్రల్ హాల్తో పాటు.. స్పీకర్, మండలి ఛైర్మన్ నివాసాలు, సిబ్బంది గృహాలు కూడా నిర్మించాలని భావిస్తున్నామన్నారు.
మాస్టర్ ప్లాన్లో ఇప్పటికీ పరిరక్షణ కట్టడం
ఎర్రమంజిల్లో భవనాలకు హెచ్ఎండీఏ చట్టం ప్రకారం రక్షణ కొనసాగుతోందని సీనియర్ న్యాయవాది నళిన్ కుమార్ వాదించారు. హుడా చట్టంలో ఆ భవనాలకు చారిత్రక నిర్మాణాల పరిరక్షణ హోదా ఉండేదని.. హుడా చట్టం స్థానంలో వచ్చిన హెచ్ఎండీఏ చట్టంలోనూ అది కొనసాగుతోందన్నారు. మాస్టర్ ప్లాన్లో ఇప్పటికీ పరిరక్షణ కట్టడాల జోన్గా ఉందన్నారు. స్పందించిన ధర్మాసనం మాస్టర్ ప్లాన్ను సమర్పించాలని హెచ్ఎండీఏని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: టోల్గేట్ రుసుం రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం