ఏపీలో ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో హైడ్రామా కొనసాగుతోంది. భారీ బందోబస్తు భద్రతల నడుమ ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటి వరకు జీజీహెచ్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికొద్దిసేపట్లో మెడికల్ బోర్డు రఘురామకృష్ణరాజు గాయాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలో ఉన్న అంశాలపైనే.. అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రఘురామను జైలుకు తరలించడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై కాసేపట్లో జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వనుంది. జీజీహెచ్లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో మెడికల్ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్ బెంచ్కు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియని కారణంగా.. జాప్యం జరిగింది. పరీక్షల జాప్యంపై రఘురామ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామను రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కింది కోర్టుకు వెళ్లమని ఉన్నత న్యాయస్థానం సూచించింది. జిల్లా కోర్టు ఈనెల 28 వరకు రిమాండ్ విధించడంతో.. ఎంపీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.