నగరంలోని కొన్ని అద్భుత కట్టడాలు...చరిత్రకు సాక్షంగా నిలుస్తున్నాయి. అలాంటి అపురూప సంపదను పదిలంగా నేటి తరానికి అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. నగరంలోని పలు కట్టాడాలను, జంక్షన్లను ఇప్పటికే ఆధునీకరించారు. అందులో భాగంగానే నాంపల్లిలోని మొజంజాహీ మార్కెట్నూ సుందరీకరించారు.
ఎంజే మార్కెట్ నేపథ్యం...
పాతబస్తీకి, కొత్త నగరానికి అందుబాటులో ఉండేలా ఎంజే మార్కెట్ను అప్పటి పాలకులు నగరం మధ్యలో ఏర్పాటుచేశారు. అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించారు. 1935లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండో కుమారుడు నవాబ్ మొజంజా బహదూర్ పేరుతో మొజంజాహీ మార్కెట్ను నిర్మించారు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120 దుకాణాల సముదాయంగా దీన్ని నిర్మించారు. 1947 వరకు ఎంజే మార్కెట్ ప్రముఖ పాన్బజార్గా పేరు పొందింది. ఇక్కడ దొరకని పాన్ వెరైటీలు ఉండవు. క్రమక్రమంగా ఎంజే మార్కెట్ కూరగాయలు, మాంసం, పండ్లు, పూల దుకాణాలు, అత్తరు, స్వీట్, ఐస్ క్రీమ్ షాప్ ఇలా వివిధ రకాల వస్తువులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. 1980 లో పండ్ల మార్కెట్ కొత్తపేట్కు, 2009లో పూల మార్కెట్ గుడిమల్కాపూర్కు తరలిపోయాయి.
హంగులద్దుకున్న ఎంజేమార్కెట్...
చరిత్ర ఘనంగానే ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అంద విహీనంగా మారింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఎంజే మార్కెట్ను దత్తత తీసుకున్నారు. నిజాం కాలం నాటి అందాలను తిరిగి తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రూ.10 కోట్లతో మార్కెట్ను సందరీకరించారు.
రాత్రి వేళల్లో టూరిజం ప్రియులను ఆకర్షించేందుకు రంగు, రంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. పైన నుంచి నగరంతో పాటు... మెట్రో రైలు చూస్తూ రోజు సాయంత్రం సేద తీరేందుకు వీలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మార్కెట్ పైన భారీ ఎత్తున జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. మార్కెట్ 87 ఏళ్ల నిర్మాణ అనంతరం పుర్వ వైభవం కలుగనున్నందున చరిత్ర ప్రేమికులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్న ఎంజే మార్కెట్లోకి సాయంత్రం నుంచి ప్రజలను అనుమతించనున్నారు.