రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని తుంగలో తొక్కి తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరిని భాజపా మరోసారి చాటుకుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం ఒక సమాచార హక్కు పిటిషన్కు సమాధానం ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదంటూ వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్టయిందని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎలాంటి పోరాటానికైనా సిద్ధం...
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి కోరడంతో పాటు పలుమార్లు లేఖలు రాశారన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నామని.. 150 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే తగిన కార్యాచరణ చేపడతామని కేటీఆర్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన కేంద్రాన్ని తెరాస ఎంపీలు ప్రశ్నిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎలాంటి స్పందన లేదు...
రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టుల కోసం పదే పదే సంప్రదిస్తున్నప్పటికీ.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు రిక్తహస్తం చూపడం భాజపాకు అలవాటుగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో చాలా కాలంగాపెండింగులో ఉన్న 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్లు, 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలు, రైల్వే కాజీపేట వ్యోగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు కూడా కేంద్రం నుంచి కనీస స్పందన లేదన్నారు. ప్రతిసారీ బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానే దిక్కవుతోందని... ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని రైల్వేలైన్లకు ఒక్క రూపాయి కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న బుల్లెట్, హైస్పీడ్ రైళ్ల విషయంలోనూ రాష్ట్రానికి భాజపా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా కేటాయించకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు.
అత్యంత చవకగా అమ్మేస్తోంది...
రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్ తరాలకు భాజపా ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రైల్వే వ్యవస్థను సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ కలిగిన 12 క్లస్టర్లను గుర్తించి 109 ప్రధాన రైలు మార్గాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు నిర్ణయించిందని... దీని వల్ల రైల్వేలకు సుమారు 63 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కంపెనీలను చవకగా అమ్మేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాల్లో రైల్వేలను కూడా భాగం చేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఏడు రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను అత్యంత చవకగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
రైల్వే లైన్లతో పాటు రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్ పరం చేస్తూ.. సాధారణ ప్రజలకి రైల్వేస్టేషన్లోకి కూడా ప్రవేశం లేకుండా చేస్తోందన్నారు. రైల్వే స్టేషన్లపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైల్వేల ప్రైవేటీకరణకు అత్యంత ఉత్సాహంతో ముందుకు పోతున్న కేంద్రం స్థానికంగా రెండు పడక గదుల ఇళ్ళు, రోడ్డు విస్తరణ వంటి కార్యకలాపాలకు కావాల్సిన స్థలాన్ని అడిగితే మాత్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. రైల్వేల ప్రైవేటీకరణ చేస్తే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా పోయి దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలపై గగ్గోలు చేస్తున్న భాజపా నాయకులు దీనిపై సమాధానం చెప్పాలన్నారు.