రాష్ట్రలో కరోనా వైరస్ నియంత్రణకు లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మే 7వరకు నిబంధనలను కొనసాగించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇదివరకే కేసులు నమోదు చేసిన పోలీసులు.. మరింత కఠినంగా లాక్డౌన్ను అమలు చేయనున్నారు. రాచకొండ పరిధిలోని నేరెడ్మెట్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో సీపీ మహేశ్భగవత్ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
రాజధానిలో..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల రసాయనాలు వెదజల్లుతున్నారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ పరిసరాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. హైదరాబాద్ మలక్పేటలో అగ్నిమాపకశాఖ, విపత్తు నివారణశాఖ ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ పర్యవేక్షించారు. ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో..
వాహనాల తనిఖీలు ఇంకా కఠినతరం చేయాలని వరంగల్ సీపీ రవీందర్ సూచించారు. వాహనాలను కట్టడి చేసేందుకు వరంగల్ త్రినగరి పరిధిలో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు సందర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు లాక్డౌన్ పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట సీపీ కార్తికేయ వాహనాలు తనిఖీ చేశారు. ఇప్పటివరకు 3వేల వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో...
తాత్కాలిక శిబిరం ఏర్పాటుతో గుత్తికోయలకు ఆహారం అందించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి.. లాక్డౌన్ వల్ల కలిగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో 14 కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేందుకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. పలు ప్రాంతాల్లో తనిఖీలతోపాటు.. బయట తిరిగేవారిపై నిఘా వేసేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. కరీంనగర్లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్రావు పర్యటించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, అవసరమైన సరుకులు ఇంటి వద్దకే పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.
"టి- కన్సల్ట్" యాప్ ప్రారంభం..
మెదక్లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ప్రజల సౌకర్యార్థం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా టిటా అసోసియేషన్ తయారు చేసిన "టి- కన్సల్ట్" యాప్ను ప్రభుత్వ విప్ సునీత ప్రారంభించారు. యాప్ ద్వారా ప్రజలు ఇంటి నుంచే వైద్యులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: లాక్డౌన్పై కీలక నిర్ణయాలు.. రేపటి నుంచే అమల…