దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు జరిగే పేపర్-1, పేపర్-2 పరీక్షలను 1,61,579 మంది రాయబోతున్నారు. ఏపీ నుంచి 87,797, తెలంగాణ నుంచి 73,782 మంది దరఖాస్తు చేశారు. బీటెక్ సీట్ల కోసం పేపర్-1, బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 నిర్వహిస్తారు. బీఆర్క్కు పేపర్- 2ఏ, బీప్లానింగ్కు పేపర్-2బి ప్రశ్నపత్రాలిస్తారు. మొదటిరోజు పేపర్-2 పరీక్ష, ఆ తర్వాత మూడు రోజులు పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పేపర్-2 కొన్ని వేల మందే రాస్తారు. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరుపుతుంటారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలుంటాయి.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ
ఆంధ్రప్రదేశ్లో..
విశాఖపట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం
ఈసారి కొత్తగా..
* తొలిసారిగా ఆంగ్లం, హిందీతోపాటు తెలుగు సహా మరో 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
* పేపర్-1లో గతంలో 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి 90 ప్రశ్నలిస్తారు. ఒక్కో సబ్జెక్టులో 30 ప్రశ్నలిస్తారు. అందులో ప్రతి సబ్జెక్టులో ఒక సెక్షన్లో 10 ప్రశ్నల్లో అయిదింటికి జవాబులు ఇవ్వాలి. కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి ఛాయిస్ ఇస్తున్నారు. పేపర్-2ఏలో 82, 2బీలో 105 ప్రశ్నలిస్తారు. వాటిల్లో కూడా ఛాయిస్ ఉంటుంది.
హాల్టికెట్పై సూచనలు చదివారా?
హాల్టికెట్ (అడ్మిట్ కార్డు)పై ముద్రించిన కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పూర్తిగా చదవాలని, అందులో ఏ వస్తువులు పరీక్షకు తప్పనిసరిగా తీసుకెళ్లాలో.. ఏవి తీసుకెళ్లరాదో ఇచ్చారని జేఈఈ మెయిన్ పేపర్-2 నిపుణుడు పి.వెంకటేశ్వర్రావు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగా పరిశీలించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ లాంటి నగరాల్లో అది చాలా అవసరమని ఆయన తెలిపారు. గత ఏడాది కొందరు విద్యార్థులు హైదరాబాద్లో మౌలాలికి బదులు మల్లాపూర్ టీసీఎస్ అయాన్ కేంద్రానికి చేరుకున్నారని, వారు ముందుగా రావడం వల్ల మళ్లీ సకాలంలో అక్కడికి వెళ్లి పరీక్ష రాయగలిగారని నిపుణులు గుర్తుచేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది.