‘మాస్క్ ఉంటేనే లోపలికి ప్రవేశం.. పనిచేసేటప్పుడూ ఉండాల్సిందే. రాగానే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి’ అంటూ పనివారిని కొన్ని అపార్టుమెంట్ల అసోసియేషన్లు, యజమానులు షరతులతో అనుమతిస్తున్నారు. మరి కొన్నిచోట్ల జూన్ 1 నుంచి రావాలని చెబుతున్నారు.
ఇళ్లలో వంట పని, ఇంటి పని చేసే మహిళలు తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు లక్షల వరకు ఉంటారని అంచనా. వీరితోపాటు అపార్ట్మెంట్లలో ఇస్త్రీ చేసేవారు, కార్లు కడిగే వారిని కరోనా కేసులు నమోదవడం మొదలయ్యాక వైరస్ భయంతో యజమానులు పనికి రానివ్వకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి పలు సడలింపులు ఇవ్వడంతో.. పనిచేసేందుకు రమ్మంటారా? అంటూ ఇంటి యజమానులకు పనివాళ్లు ఫోన్లు చేస్తున్నారు. హయత్నగర్ పరిధిలోని ఓ భారీ గేటెడ్ కమ్యూనిటీలో పనివాళ్లను అనుమతిస్తున్నారు. గేట్ దగ్గరే శానిటైజర్ ఇస్తూ, మాస్క్లున్న వారినే అనుమతిస్తున్నామని ఓ ఫ్లాట్ యజమాని శ్రీనివాస్రావు చెప్పారు.
‘ జూన్ 1 నుంచి పని మనుషుల్ని అనుమతించాలని మా అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది’ అని చందానగర్కు చెందిన ఐటీ ఉద్యోగి ఆనంద్ తెలిపారు. కొందరు ఇంటి యజమానులు మరికొంత కాలం చూద్దామన్న ధోరణిలో ఉన్నారు. ‘బుధవారం నుంచి ఇస్త్రీ చేసేందుకు అపార్ట్మెంట్లోకి అనుమతిస్తున్నారు. రెండు నెలలపాటు పైసా ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడ్డాం’ అని నాగోల్ ప్రాంతానికి చెందిన విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు.