తెలంగాణలోని నగరాలు, పట్టణాలు సహా వాటి పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించే(land regularization in telangana) ప్రక్రియను మరోసారి చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికిముందు ఎంత విస్తీర్ణం కబ్జాలో ఉంది, ఇంకెంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏంటనేది తేల్చేదిశగా కలెక్టర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఎసైన్డ్, గ్రామకంఠం, వక్ఫ్, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూముల విస్తీర్ణంతోపాటు ఇప్పటికే జీవోలు 58, 59, 166 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను పంపాలంటూ పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఇటీవల కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఆయా వివరాలను యంత్రాంగం కొంతమేరకు సేకరించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల అనంతరం క్రమబద్ధీకరణ(land regularization in telangana)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఇళ్ల స్థలాలపైనా
అధికారులు సీలింగ్ భూములు సహా లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములు వివరాలనూ సేకరిస్తున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణం పంపిణీ చేస్తే..లబ్ధిదారులు ఎంతమేరకు వినియోగించుకున్నారనేదీ లెక్క తీస్తున్నారు. ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు సేకరించిన భూమిలో వినియోగంపోనూ..మిగిలిన భూమి ఏ స్థితిలో ఉందనేదీ పరిశీలిస్తున్నారు. గ్రామకంఠం ఎంతఉంది? దానిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల విస్తీర్ణం ఎంత? అసైన్డ్ భూములు(Assigned lands) ఏమేరకు చేతులు మారాయి? లబ్ధిదారుల అధీనంలో ఉన్న విస్తీర్ణం, ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తిస్తున్నారు. దీంతోపాటు ఆయా భూముల మార్కెట్ ధరలనూ నమోదు చేస్తున్నారు.
2008కి ముందు అందిన దరఖాస్తులు కూడా..
తెలంగాణ ఆవిర్భావం(Telangana formation) అనంతరం ప్రభుత్వం జీవో 58, 59ల కింద ప్రభుత్వ స్థలాలను అధీనంలో ఉంచుకున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి క్రమబద్ధీకరణ(land regularization in telangana) ప్రక్రియ చేపట్టింది. 125 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించింది. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఆవాసం ఏర్పరుచుకున్న వారి నుంచి మార్కెట్ ధర రాబట్టింది. తద్వారా ప్రభుత్వానికి రూ.383.11 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వ స్థలాలను అధీనంలో ఉంచుకుని, నిర్మాణాలు చేయని వారికీ ప్రభుత్వం అప్పట్లో క్రమబద్ధీకరణ(land regularization in telangana) అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా 2008కి ముందు అందిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుని, కొన్నింటిని పరిష్కరించింది. వాటిలో ఇంకా 1.40 లక్షలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవోలు 58, 59, 166ల పరిధిలో పరిష్కారానికి నోచుకోని 4.25 లక్షల దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని సర్కారు భావిస్తోంది. వీటితోపాటు అసైన్డ్, గ్రామకంఠం విస్తీర్ణంలో ఎటువంటి హక్కులు పొందకుండా నివాసాలు ఏర్పాటుచేసుకున్న వారికీ క్రమబద్ధీకణ(land regularization in telangana) అవకాశం కల్పించాలనుకుంటోంది. ముందుగా భూమికి హక్కులు కల్పించి, తరువాత నిర్మాణాలను క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. తద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలనే కార్యాచరణను సర్కారు అమలుచేయబోతున్నట్టు తెలిపింది.