పారిశుద్ధ్యమైన భారతదేశం సాధనే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన కార్యక్రమాలు ఈ మిషన్లో చేపడుతున్నారు. మురుగునీటి నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, తడిపొడి చెత్త వేరుచేయడం వంటి అనేక కార్యక్రమాలను రూపొందించి.. అమలుచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వాటిలో మెరుగైన ఫలితాల సాధించిన వాటిని గుర్తించడం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
దేశంలో పరిశుభ్రత నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరోసారి గుర్తింపు పొందింది. గత నాలుగేళ్ల నుంచి ర్యాంకుల్లో తన ఆధిపత్యాన్ని చాటుతోంది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మెరుగైన ర్యాంకులు మాత్రం సాధించలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా స్వచ్ఛ ర్యాంకుల్లో హైదరాబాద్ వెనుకబడే ఉంది.
హైదరాబాద్ నగరం 2015లో 275వ ర్యాంకు, 2016లో 19వ ర్యాంకు, 2017లో 22వ ర్యాంకు, 2018లో 27వ ర్యాంకు, 2019లో 35వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. దేశంలో ఇన్నోవేటివ్, బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తున్న ఏకైక నగరంగా మాత్రం జీహెచ్ఎంసీ గుర్తింపు పొందింది.
ఇన్నోవేటివ్లో భాగంగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో గ్రీన్ కియోస్కో స్ట్రీట్ ఫుడ్ పార్కు, దేశంలోనే ప్రత్యేకంగా డాగ్ పార్కు ఏర్పాటు, రీసైకిల్డ్ ప్లాస్టిక్తో టిన్బిన్స్, ఫీడ్ ద నీడ్ వసతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 40 లక్షల జనాభా పైబడిన నగరాల్లో జీహెచ్ఎంసీకి.. బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డు లభించింది. చాలా సమస్యలు పరిష్కరించకుండానే ఆన్లైన్లో సరిదిద్దినట్లు చూపుతున్నారని పలువులు ఆరోపిస్తున్నారు.
శౌచాలయాల కొరత..
స్వచ్ఛ ర్యాంకింగ్స్లో ప్రధానంగా.. పరిశుభ్రతతో పాటు.. కనీస వసతుల కల్పనపై దృష్టిసారించింది. ఈ రెండింటిలోనూ జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 400 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 135 బీవోటి, 109 ఫ్రీ ఫ్యాబ్రీకెటెడ్, 46 సులభ్, 57 ఇంజినీరింగ్, 15 షీ-టాయిలెట్లు, 20 కమ్యునిటీ టాయిలెట్లు ఉన్నాయి. వీటిలోనూ చాలావాటి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
గ్రేటర్ పరిధిలో 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వాటిలో 5 వేల కిలోమీటర్ల రోడ్లు ప్రధాన మార్గాల్లో ఉంటాయి. ప్రతి 500 మీటర్లకు ఒక టాయిలెట్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆ లెక్కన నగరంలో 2500 టాయిలెట్స్ కనీసం ఉండాలి. అందులో కేవలం 20 శాతం శౌచాలయాలు ఉన్నాయి. ప్రతి జోన్లో 500 చొప్పున మొత్తం 3వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... కొన్ని జోన్లలో ఇప్పటికీ స్థలాల గుర్తింపే పూర్తికాలేదు. మరికొన్ని చోట్ల పనులు ముందుకుసాగడం లేదు. నగర పరిధిలోని పెట్రోల్ బంకుల్లోని శౌచాలయాలను ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయా యాజమాన్యాలకు బల్దియా ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చెత్త నిర్వహణలో లోపం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. చెత్త సేకరణ నిర్వహణ కోసం ఏటా అధిక వ్యయం చేస్తోంది. రోడ్లపై చెత్తను శుభ్రం చేయడం, ఇంటింటి నుంచి సేకరించడం పనులను జీహెచ్ఎంసీ చేస్తోంది. దీనికోసం దాదాపు 25 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇంటింటి నుంచి చెత్తను సేకరణ కోసం 2,500 పైగా ఆటోలున్నాయి. వీటిలో మరో 5వేల మంది విధులు నిర్వహిస్తున్నారు.
అయినా చెత్త నిర్వహణలో బల్దియా విఫలం అవుతూనే ఉంది. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడడం, పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు, నాలాలు, డ్రైన్లతో వ్యర్థాలు పేరుకుపోవడం వంటివి స్టార్ రేటింగ్ రాకపోవడానికి ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు.
నగరంలోని గార్బేజ్ పాయింట్ల తొలగింపు కార్యక్రమం ద్వారా రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా బల్దియా చేసింది. వ్యర్థాలు తొలగించి.. అక్కడ మళ్లీ చెత్త వేయకుండా ముగ్గులు వేశారు సిబ్బంది. 1,116కి పైగా గార్బేజ్ పాయింట్లు తొలగించినట్లు బల్దియా ప్రకటించింది. వీటిలో మెజార్టీ స్థానాల్లో చెత్తకుప్పలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు.
ఇంజినీర్లకు పనులు..
కొద్ది నెలలుగా బల్దియా శానిటేషన్ పనులను ఇంజినీర్లకు అప్పగించింది. ఈ చర్య కూడా ర్యాంకింగ్స్లో వెనుకబాటుకు కారణంగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయి పర్యటనలను గాలికి వదిలేశారు. ఇలాంటి వైఫల్యాలు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్లో బల్దియా వెనుకబాటుతనానికి కారణాలు అవుతున్నాయి.