గ్రేటర్ పరిధిలో పేద ప్రజలకు పూర్తి ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం ఇప్పుడు దళారులకు వరంగా మారుతోంది. ఉన్న తక్కువ ఇళ్లకు ఎక్కువ సంఖ్యలో ఆర్జీలు వస్తున్నాయి. వీరికే దళారులు గాలమేస్తున్నారు. ఓవైపు ముఠాలు.. మరోవైపు జీహెచ్ఎంసీలో పనిచేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధుల అనుయాయులు యథేచ్ఛగా దందా నడిపిస్తున్నారు.
బయటపడ్డ నిజాలు...
ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. దళారిగా వ్యవహరిస్తున్న మహిళను ఫోన్లో సంప్రదించి... తమకు ఇళ్లు కావాలని అడగ్గా... ఎంతవరకు పెట్టగలరంటూ ఆ మహిళ ప్రశ్నించింది. 10లక్షల రూపాయలు అని చెప్పగా... అంత తక్కువకు ఏదీ రాదు... కానీ కేసీఆర్ ఇళ్లు అయితే తక్కువలో ఇప్పించగలనని తెలిపింది. సరేనని.. ఎలా పొందాలో చెప్పాలని అడిగితే.. 50వేల రూపాయలు తీసుకుని చెంగిచెర్లలోని తన నివాసానికి వస్తే అన్ని విషయాలు చెబుతానంది. సదరు మహిళ పంపిన చిరునామాకు ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ రెండు పడక గదుల ఇళ్లు పొందేందుకు వివరాలు ఆమెను తెలుసుకునే ప్రయత్నం చేయగా... జిల్లా కలెక్టరేట్లో ఓ కీలక అధికారి తనకు తెలుసని... ఓ ఎమ్మెల్యే వరసకు సోదరుడవుతారని... మీరు డబ్బులు చెల్లిస్తే ఇళ్లు ఇప్పించే పూచీ నాదని ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఆన్లైన్ ద్వారా పంపితే మీకు ఒప్పంద పత్రం కూడా ఇస్తానని చెప్పారు. హైదరాబాద్లో స్థానిక రేషన్కార్డు, ఆధార్కార్డు ఏమీలేవు. ఇళ్లెలా వస్తుందని సదరు మహిళను అడగ్గా... తన దగ్గర ఇప్పటికే ఏ పత్రాల్లేకుండా ఇప్పించిన డాక్యుమెంట్లను చూపించి... నగరంలో ఇళ్లు లేకుండా ఉంటే చాలు.. మిగతాది నేను చూసుకుంటానంటూ హామీ ఇచ్చింది.
అధికారులు తెలుసంటూ వసూళ్లు...
నగరవ్యాప్తంగా మొత్తం లక్ష ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం పనులు కొనసాగిస్తోంది. వీటిలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు అందుబాటులోకి వచ్చి లబ్ధిదారులకు అందగా... చాలావరకు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తి కాని వాటికి ఇప్పటివరకు కేటాయింపులు జరగలేదు. వీటిని ఇప్పిస్తామంటూ దళారుల ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అధికారులు తమకు తెలుసంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు కూడా...
ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో కొన్ని ముఠాల ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. దుండిగల్ పరిధిలో ఏకంగా 300 మంది దగ్గర 3 కోట్ల 50లక్షల రూపాయలను ముఠాలు వసూలు చేశాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి అక్రమార్కులను అదుపులోకి తీసుకొని 80శాతం సొమ్ము స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. జూబ్లీహిల్స్ పరిధిలో 75 మంది ఆశావహుల నుంచి 15లక్షలు వసూలు చేశాడో ప్రభుత్వ ఉద్యోగి. ఇలా నగరంలో దాదాపు అన్ని చోట్ల ముఠాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
ఇళ్లు రాకపోతే డబ్బులు వాపస్...
కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్లో 144 రెండు పడక గదులు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇటు హైటెక్సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో వీటి కోసం స్థానిక నేతల అనుచరులతో పాటు, బల్దియాలో పనిచేసే కొందరు ఉద్యోగులూ పెద్దఎత్తున దందా చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల దాకా వసూలు చేసినట్లు సమాచారం. ఓ స్థానిక వ్యాపారి అల్లాపూర్, మూసాపేట, బోరబండ ప్రాంతాలకు చెందిన 10మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. ఆయనపై నమ్మకంతో ఇచ్చామని.. ఒకవేళ ఇళ్లు దక్కకపోతే డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పాడంటూ వారు చెప్పడం గమనార్హం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకంలో దళారులు ఇష్టారాజ్యం చెలాయిస్తూ డబ్బులు వసూలు చేస్తుండడం పలు విమర్శలకు దారి తీస్తుంది. దీని పై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపడితే అర్హులైన వారికి లబ్ది చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.