బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగరంలో అధికార తెరాసతోపాటు భాజపా, ఎంఐఎంను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ది. గత గ్రేటర్ ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను చవిచూసిన కాంగ్రెస్ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు మొదలుపెట్టింది. దీనికి తోడు... పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్... నేతల్లో కదలిక తెచ్చారు. పార్టీ సినియర్లను సైతం కలగలుపుకుని ముందుకెళ్లుతున్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు లేవన్న భావన తీసుకొచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ నేతలంతా బాధ్యతగా పని చేశారు.
ఎదురుదాడి చేసే స్టార్ క్యాంపెయినర్లు
దుబ్బాక ఉప ఎన్నికలో విభేదాలను పక్కన పెట్టి ఎవరికి వారు అప్పగించిన పని చేసి... మొట్టమొదటిసారి కాంగ్రెస్లో ఐక్యత ఉందన్న భావన తీసుకొచ్చారు. పార్టీ నేతలంతా ఒకటి కావడం వల్ల బల్దియా ఎన్నికల్లో కూడా అదే మాదిరిగా పని చేసేందుకు బూతు స్థాయి వరకు ఇంఛార్జ్లను నియమించి... విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడి ఎదురుదాడి సత్తా కలిగిన నాయకులను కొందరిని స్టార్ క్యాంపెయిన్లుగా నియమించాలని పీసీసీ యోచిస్తోంది. ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఎదుర్కొనే అభ్యర్థులు..
గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించిన పీసీసీ... ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ దపా ముందస్తుగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది. గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించేందుకు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఛైర్మన్గా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రేటర్ పరిధిలో సమస్యలను గుర్తించి మ్యానిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఈ నెల 23న తమ మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. అదే విధంగా బల్దియా బరిలో నిలిచేందుకు ఆసక్తి కలిగిన నాయకులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 18వరకు గడువు ఉండటం వల్ల... ఇవాళ, రేపు పెద్ద సంఖ్యలో వస్తాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా కలిగిన నాయకులను బరిలో దించేందుకు కసరతు చేస్తోంది.
ఇదీ చూడండి: పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలి: పార్థసారథి