యూరియా కొరత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చుకోవాడానికే కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలకు మించి యూరియాను కేంద్రం కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ఆరోపణలు కేంద్ర మంత్రి సదానంద గౌడకు వివరించినట్లు తెలిపారు. ఖరీఫ్కు ముందే కేంద్రం యూరియాను పంపించగా... నిల్వ చేసుకోవడానికి గోదాములు లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
సెప్టెంబరు నెలకు లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రం కోరగా... మరో లక్ష మెట్రిక్ టన్నులు అదనంగా మంజూరు చేసినట్లు లక్ష్మణ్ వివరించారు. రాష్ట్రంలో 7.45 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని... రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని లక్ష్మణ్ విమర్శించారు.
ఇదీ చూడండి: ఈఆర్సీ లేకుండా తీసుకునే నిర్ణయాలు చట్టవిరుద్దం: రేవంత్