జాతీయ టాస్కుఫోర్సు కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరుగుతున్న సమావేశంలో గోదావరి కావేరి అనుసంధాన ప్రతిపాదనపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ఎవరూ వెళ్లట్లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలంగాణ నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్, సోమశిల మీదుగా గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసి గతంలోనే పంపింది. వాటిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ అభ్యంతరాలను జాతీయ జల అభివృద్ధి సంస్థకు తెలియజేశారు. అంతకన్నా పోలవరం నుంచి అనుసంధానం చేపడితే తమకు అభ్యంతరం ఉండబోదని ఏపీ పేర్కొంటోంది.
2 చోట్ల నుంచి 3 ప్రత్యామ్నాయాలు
తెలంగాణలోని రెండు చోట్ల నుంచి గోదావరి జలాలను మళ్లించేలా జల అభివృద్ధి సంస్థ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసింది.
మొదటి ప్రత్యామ్నాయం: గోదావరిపై జానంపేట నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలోనే మళ్లింపు.
రెండో ప్రత్యామ్నాయం: గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలో మళ్లింపు.
మూడో ప్రత్యామ్నాయం: రెండో విధానంలో భాగంగా కాలువ కాకుండా పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించడం.
ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు...
- ప్రస్తుతం గోదావరిపై నిర్మించి ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులకు నీటిని మినహాయిస్తే ఇచ్చంపల్లి వద్ద లేదా జానంపేట వద్ద కాని నదుల అనుసంధానానికి మళ్లించేంత నీరు ఉండదు.
- ఏపీ లెక్కల ప్రకారం అంత నీటి లభ్యత లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ ఈ మిగులు నీటిని ఎలా లెక్కించిందో ఆ వివరాలు పూర్తిగా పంపలేదు. (ఆ లెక్కలన్నీ తమకు పంపాలని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే లేఖ రాసింది.)
- నీటి లభ్యత లేకుండా ఇచ్చంపల్లి వద్ద నుంచి అనుసంధానం చేపడితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నష్టపోతుంది.
- అందువల్ల ఆంధ్రప్రదేశ్ పోలవరం నుంచి పెన్నాకు నీటిని మళ్లించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గోదావరిపై దిగువన ఉన్న చివరి ప్రాజెక్టు పోలవరమే. అక్కడి నుంచి నీటిని మళ్లించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.