పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై.. రాజధాని పరిధిలోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్ చేస్తున్నారు. మందడంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు తేల్చిచెప్పారు.
గడువు కంటే ముందే ఎలా బిల్లు తీసుకొస్తారు
సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రివర్గం ఎలా ఆమోదిస్తుందని రైతులు ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని మండిపడ్డారు. రైతుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చేతకానివాళ్లుగా ప్రభుత్వం భావిస్తోందని.. న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని రైతులు స్పష్టం చేశారు.
పోలీసులకు సహాయ నిరాకరణ
రాజధాని గ్రామాల్లో రైతులపై లాఠీఛార్జికి నిరసనగా బంద్కు ఐకాస పిలుపునిచ్చింది. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించరాదని నిబంధన పెట్టుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపనున్నారు.
ఇదీ చూడండి: మూడు ముక్కలుగా ఏపీ రాష్ట్ర రాజధాని