అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న కాజీపేట్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధింపు కోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి చేపట్టిన నిరసన దీక్షలో వినోద్ పాల్గొన్నారు. ఛలో హైదరాబాద్ నినాదంతో పోరాట సమితి చేపట్టిన నిరసన దీక్షకు అన్ని పార్టీలు, వామపక్షాలు మద్దతు పలికాయి.
కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థానిక ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమైందని వినోద్ కుమార్ వివరించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేంత వరకూ తెరాస మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ స్వప్నమని... పునర్విభజన చట్టంలో కూడా కోచ్ ఫ్యాక్టరీ హామీ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 న దిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేయబోయే దీక్షకు సీపీఐ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు.