ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదో దశ సార్వభౌమ పసడి బాండ్ల జారీ సోమవారం (జనవరి 11 న) ప్రారంభమైంది. జనవరి 15న శుక్రవారం ఇష్యూ ముగుస్తుంది. గ్రాము ధర రూ. 5,104 గా నిర్ణయించారు. ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబడుదారులకు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణుల అభిప్రాయం.
2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. ఈ సార్వభౌమ పసిడి బాండ్లను భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది.
2019, 2020 సంవత్సరాల్లో బంగారం గణనీయమైన లాభాలను సాధించింది. రెండంకెల వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వద్దకు చేరింది. కొంతకాలంగా రూ. 48,000-రూ.52,000 పరిధిలో ట్రేడవుతోంది.
అయితే అమెరికా డాలర్ బలోపేతం, అధిక బాండ్ల దిగుబడి కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు బంగారం ఖరీదైనదిగా మారింది.
అమెరికాలో పాలన మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, కరోనా టీకా ప్రక్రియ సమర్థత బంగారం ధరలకు మార్గనిర్దేశం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరు నెలలకోసారి వడ్డీ జమ..
దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు సార్వభౌమ గోల్డ్ బాండ్లను 2015లో ప్రవేశపెట్టారు. వీటిని కూడా గ్రాముల లెక్కల్లోనే కొలుస్తారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయం అని నిపుణులు చెబుతుంటారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటంలో ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అంతే కాకుండా వీటిపై వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని అర్ధ వార్షికానికి ఒకసారి బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది ఉండదు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్లో ఉన్నబంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణయమవుతుంది.
గరిష్ఠ పరిమితి నాలుగు కిలోలు..
ఒక వ్యక్తి కనీసం 1 గ్రాము నుంచి 4కిలోల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హిందూ అవిభాజ్య సంస్థలకు కూడా 4కిలోల పరిమితి ఉండగా.. ట్రస్ట్లకు 20కిలోల గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇష్యూలలో కలిపి ఈ స్థాయి వరకు కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాకుండా సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినవి కూడా దీని పరిధిలోకి వస్తాయి.
పన్ను ప్రయోజనాలు..
వీటిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. టీడీఎస్ కూడా ఉండదు. ఈ బాండ్లను కానుకగా కూడా ఇవ్వొచ్చు. వీటిని బ్యాంకులలో సెక్యూరిటీలుగా ఉంచి రుణాలను కూడా పొందవచ్చు. సాధారణ బంగారు రుణంపై తీసుకున్న విలువ ప్రకారమే వీటిపై కూడా రుణం తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో బ్యాంకులు, ఫినాన్స్ సంస్థల నిర్ణయమే అంతిమం.
వీటిని గ్రాముల ప్రకారం పార్ట్ రిడీమ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మొత్తం పెట్టుబడి ఒకే సారి వెనక్కి తీసుకోకుండా కొంచెం కొంచెంగా ఉపసంహరించుకోవచ్చు.
ఇదీ చూడండి:పెరిగిన బంగారం, వెండి ధరలు