మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ కంపెనీలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు గోవాలో జీఎస్టీ సమావేశానికి ముందు ప్రకటించారు.
సెస్, సర్చార్జీలు లేకుండా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ సెస్, సర్ చార్జీలు ఉంటే మాత్రం ఇదే పన్ను రేటు 25.17 శాతం ఉంటుందని చెప్పారు. ఈ కొత్త పన్ను రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు నిర్మల. కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా వచ్చే రాబడి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలు తగ్గుతుందని అంచనా వేశారు.
దేశంలో పెట్టుబడి, వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు నిర్మల. ఆదాయపు పన్ను చట్టంలో చేసిన మార్పులను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. 22 శాతం ఆదాయపు పన్ను స్లాబ్ను ఎంచుకునే కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్ను మ్యాట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 1 తర్వాత కొత్తగా వచ్చిన దేశీయ తయారీ సంస్థలు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా 15 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించవచ్చని తెలిపారు. అయితే.. కొత్త ఉత్పాదక సంస్థలకు సమర్థవంతమైన పన్ను రేటు అన్ని సర్చార్జీలు, సెస్లతో కలిపితే 17.1 శాతం ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: జీఎస్టీ భేటీ: వాహన రంగానికి ఈరట లభించేనా..?