ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్ల నిధులు అందించేందుకు పార్లమెంటు అనుమతిని ప్రభుత్వం కోరింది. బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు మూలధనాన్ని కలిగి ఉండేందుకు ఈ నిధులను అందజేయనుంది. 'ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్వ్యవస్థీకరణకు అవసరమయ్యే నిధులకు గాను ప్రభుత్వ సెక్యూరిటీస్ జారీ ద్వారా రూ.20 వేల కోట్ల అనుమతిని ప్రభుత్వం అడిగినట్లు' తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా రుణాల వృద్ధిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్లను మూలధన సాయంగా ఇవ్వాలని 2019-20లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే 2020-21 బడ్జెట్లో బ్యాంకులకు మూలధనం ఇవ్వడంపై ఎటువంటి హామీని ప్రభుత్వం ఇవ్వలేదు. బ్యాంకులు తమకు అవసరమయ్యే నిధులను మార్కెట్ ద్వారా సమీకరిస్తాయనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్పీఏలు 31 శాతం తగ్గాయి..
పెద్ద పరిశ్రమ రంగాలు, సేవల విభాగంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు) గత రెండేళ్లలో 31 శాతం తగ్గి.. ఈ ఏడాది జూన్లో రూ.4.36 లక్షల కోట్లకు పరిమితం అయ్యాయని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు వివరించారు.
దేశీయంగా కార్యకలాపాలపై ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2020 జూన్ 30 నాటికి పెద్ద పరిశ్రమలు, సేవలకు సంబంధించి వాణిజ్య బ్యాంకుల ఎన్పీఏలు రూ.4,36,492 కోట్లకు పరిమితమయ్యాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,48,749 కోట్ల మేర రుణాలు వసూలు చేయగలిగాయని పార్లమెంటుకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి వెల్లడించారు.
ఇతర రంగాల్లో ఎన్పీఏలు..
వ్యవసాయం- దాని అనుబంధ కార్యకలాపాలు, పరిశ్రమలు, విద్యా రుణం, గృహ రుణం, ఇతరత్రా రుణాలు.. ఇలా ఐదు విభాగాల్లో 2020 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.6,44,417 కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ఐదింటిలోనూ అత్యధికంగా పరిశ్రమల విభాగంలో రూ.3,33,143 కోట్ల ఎన్పీఏలు ఉన్నాయని తెలిపారు.
బ్యాంకులకు రుణాల ఎగవేత, కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వాళ్లు 2015 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య 38 మంది వరకు ఉన్నారని సీబీఐ విచారణలో తేలిందని చెప్పారు.
పునర్వ్యవస్థీకరణకు అవకాశం..
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలకు సంబంధించి రూ.25 కోట్ల వరకు రుణాలను ఎన్పీఏ కింద గుర్తించకుండా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం వీలు కల్పించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా 2020 మార్చి వరకు రూ.6.51 లక్షల కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థల రుణ ఖాతాలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసిందని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడి (ఎఫ్ఐఐలు) పరిమితిని 20 శాతం నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ నిర్దేశించిన నియమావళి అనుసరించి 2016 నుంచి 34 వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఎనిమిది ఇప్పటికే పూర్తవగా.. 6 సంస్థల్లో ఈ ప్రక్రియను నిలుపుదల చేసి మూసివేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. మిగిలిన 20 సంస్థల్లో వాటా ఉపసంహరణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని ఠాకూర్ వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ బకాయిలు రూ.లక్షన్నర కోట్లు