యాపిల్ ఐఫోన్ల సరఫరా సంస్థ విస్ట్రాన్ భారత్ కార్యకలాపాల ఉపాధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పించినట్లు శనివారం ప్రకటించింది. కర్ణాటక కోలార్ జిల్లా విస్ట్రాన్ ప్లాంట్లో ఈ నెల 12న జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
'మా బృందాల భద్రత, శ్రేయస్సుకే ఎప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యం. ఇవే కంపెనీ ముఖ్యమైన విలువలు' అని విస్ట్రాన్ పేర్కొంది.
ఇటీవల ప్లాంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమని వెల్లడించింది విస్ట్రాన్. ఈ ఘటన ద్వారా కొంత మంది కార్మికులకు వేతనాలు అందలేదని, మరికొంత మందికి సరైన సమయానికి వేతనాలు రాలేదని గ్రహించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తమ కార్మికులందరికీ క్షమాపణలు చెప్పింది విస్ట్రాన్.
అప్పటి వరకు కొత్త ప్రాజెక్టులు ఉండవ్..
ఇదిలా ఉండగా.. విస్ట్రాన్కు యాపిల్ షాకిచ్చింది. ప్లాంట్లో కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు, సమయపాలన పాటించడం లేదని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. దీనితో తమ నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ పొరపాట్లన్నింటికీ దిద్దుబాటు చర్యలు తీసుకునే వరకు తమ నుంచి కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్లు పొందదని విస్ట్రాన్కు స్పష్టం చేసింది యాపిల్. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:'కార్మికుల దాడితో విస్ట్రాన్కు రూ.437 కోట్ల నష్టం'