కొత్త సంవత్సరం.. వేడుకలతో పాటు విషెస్ చెప్పుకోవడం కూడా!. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంట కొట్టగానే 'హ్యాపీ న్యూ ఇయర్' పదాలతో యావత్ ప్రపంచం మార్మోగుతుంది. మామూలుగా అయితే బంధుమిత్రులను నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. కానీ, ఈసారి కరోనా భయం, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి. అలా ఈ ఏడాది న్యూఇయర్ వేళ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో 100 కోట్ల మందికి పైగా కాల్స్ చేసుకున్నారట. ఈ మేరకు సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఒక నివేదికను వెలువరించింది.
మొత్తం 140 కోట్లు..
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున వాట్సాప్లో 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ జరిగినట్లు ఫేస్బుక్ తెలిపింది. ఒక్క రోజులో ఇంత ఎక్కువ కాల్స్ రికార్డ్ అవడం ఇప్పుడేనట. 2020 కొత్త సంవత్సరంతో పోలిస్తే ఈసారి 50శాతం ఎక్కువగా ఆన్లైన్ కాలింగ్ నమోదైనట్టు వెల్లడించింది. ఇక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలోనూ 55 మిలియన్లకు పైగా లైవ్ బ్రాడ్కాస్ట్లు జరిగినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: సోనీ 'ప్లేస్టేషన్- 5' విడుదల ఎప్పుడంటే..
కొవిడ్ కారణంగా 2020లో అనేక రంగాలు సంక్షోభానికి గురైనప్పటికీ.. సాంకేతిక రంగం మాత్రం వృద్ధి చెందిందనే చెప్పాలి. లాక్డౌన్ నిబంధనలతో నెలల తరబడి ఇళ్లకే పరిమితమవడంతో ప్రజలు తప్పనిసరిగా టెక్నాలజీపై ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు.. ఉద్యోగులకు వీడియో కాన్ఫరెన్స్లు తప్పనిసరయ్యాయి. ఇక నూతన సంవత్సరం వేడుకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో నెటింట్ట మెసేజ్లు, కాల్స్ మోత మోగింది.
ఇదీ చదవండి: 'జియో టవర్లు ధ్వంసమైతే మాకేంటి సంబంధం'