కరోనాతో అన్ని కంపెనీలు డిజిటలీకరణ దిశగా అడుగులు వేశాయి. ఈ ధోరణి ఐటీ కంపెనీలకు కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించిన మైండ్ ట్రీ జనవరి-మార్చిలోనూ ఇదే తీరును ప్రదర్శించగలదని కంపెనీ సీఈఓ, ఎండీ దేవాశీస్ ఛటర్జీ అంటున్నారు. ఆర్డర్లు ఆల్టైం గరిష్ఠాల్లో ఉన్నాయని.. క్లయింట్లు తమ కార్యాయాల్లో పెను మార్పును తీసుకువస్తుండడంతో సమీప భవిష్యత్లోనూ ఈ జోరు కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇంకా మరెన్నో అంశాలపై ఆయన విపులంగా వివరించారు. ఆ విశేషాలు..
మీ బలమైన లాభాలకు కారణం ఏమిటి? అవి కొనసాగుతాయా?
నేను ఈ సంస్థ పగ్గాలు చేపట్టినపుడు నిర్వహణ లాభం 10 శాతంగా ఉండేది. క్రమంగా అది పెరిగేందుకు అత్యంత వేగంగా ఒక ప్రణాళికను రచించాం. ప్రతీ సంస్థకు వృద్ధి అవసరం. అది సంస్థ లోపలి నుంచే మొదలుకావాలి. అందు కోసం మా మైండ్ ట్రీ ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చాం. జనవరిలో అందరికీ ఇంక్రిమెంట్లు ప్రకటించాం. దీంతో జనవరి-మార్చిలో మార్జిన్ల పై 200-250 బేసిస్ పాయింట్ల ప్రభావం పడింది. అయినప్పటికీ.. మా మార్జిన్లు 20% పైగా కొనసాగగలవని విశ్వసిస్తున్నాం.
మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఆపరేటింగ్ మార్జిన్లు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. వీటిని విలీనం చేసే అవకాశం ఉందా?
మేం ఇప్పుడు ఏ ఇతర సంస్థ కోసం చూడడం లేదు. ఇప్పటిదాకా అయితే ఇరు కంపెనీల మధ్య విలీన చర్చలు లేవు. సమీప భవిష్యత్లోనూ ఉండవు.
మీ క్లయింట్లు తగ్గుతున్నారు. దీనిపై మీ వ్యూహం ఏమిటి?
మా వద్ద భారీ ఎత్తున క్లయింట్లు ఉన్నారు. అయితే పరిమిత వ్యూహాత్మక క్లయింట్లపై దృష్టి సారించడమే మేలన్నది మా అభిప్రాయం. అపుడే మా శక్తినంతా ఉపయోగించి వారికి సేవలందించవచ్చు.
2021-22పై వృద్ధి అంచనాలు ఎలా ఉన్నాయి?
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సాధించే గరిష్ఠ స్థాయిని మేం అందుకోగలం. ఇపుడు మా చేతిలో ఉన్న ఆర్డర్లు ఆల్టైం గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికం తప్పనిసరిగా.. గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ఈ సానుకూలతలు తర్వాతి త్రైమాసికాలూ కొనసాగితే.. మొత్తం మీద వృద్ధి రాణించగలదు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి?
ప్రస్తుతం మూడు విభాగాల్లో ఆర్డర్లు వస్తున్నాయి. ఒకటేమో క్లయింట్లు చాలా వేగంగా తమ పని ప్రదేశాన్ని, సిబ్బందిలో మార్పులను తీసుకువస్తున్నాయి. కరోనా ప్రతీ ఒక్కరి విశ్వాసంపై దెబ్బకొట్టడం ఇందుకు నేపథ్యం. మరొకటి కాస్ట్ టేకవుట్ ఆర్డర్లు. మూడోది ఆసక్తికరమైనది. వారి వ్యాపార నమూనాలను డిజిటల్ దిశగా నవీకరించుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మా సర్వీసు లైన్లను ఏర్పాటు చేసుకున్నాం. సమీప భవిష్యత్లో కాస్ట్ టేకవుట్ ఆర్డర్లు కొనసాగుతాయి. అయితే డిజిటల్కు మారే ప్రక్రియ మరింత ఎక్కువ కావొచ్చు. అంటే మూడో విభాగంలో మరిన్ని ఆర్డర్లు పెరగవచ్చు.
మీ ఆర్థిక సేవల విభాగం విక్రయాలు తగ్గుతుండగా.. కమ్యూనికేషన్ విభాగం అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు?
బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో స్థిరీకరణ జరుగుతోంది. ఆర్డర్లు బాగానే ఉన్నాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కటీ నెమ్మదించించినా.. కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ(సీఎమ్టీ) విభాగం మాత్రం బాగా రాణిస్తోంది. అందులోనూ టెక్నాలజీ విభాగం బాగా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది.
టీకాల రాక వల్ల టెక్నాలజీ విభాగంపై కంపెనీలు వ్యయాలు తగ్గిస్తాయని భావిస్తున్నారా? 2021-22పై నియామకాల ప్రణాళిక ఏమిటి?
అలాంటిదేమీ జరగదు. కరోనా సమయంలో క్లయింట్లు తమ వ్యాపార నమూనాలను పునర్నిర్వచిస్తున్న విధానం, డిజటలీకరణ చేస్తున్న వేగాన్ని ఎపుడూ చూడలేదు. ఇది కొనసాగుతుంది. నియామకాల విషయానికొస్తే.. ఆర్డర్ల పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకుని, వచ్చే త్రైమాసికాల్లో క్యాంపస్లలో, విడిగా నియామకాలను చేపట్టనున్నాం.
ఇదీ చూడండి: 'హరిత పన్ను, తుక్కు విధానంతో ఇద్దరికీ లాభం'