స్టాక్ మార్కెట్లను కరోనా సెకండ్ వేవ్ భయాలు కుదిపేశాయి. బేర్ దెబ్బకు సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ ఏకంగా 1,708 పాయింట్లు తగ్గి 47,883 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 524 పాయింట్ల నష్టంతో 14,310 వద్దకు చేరింది.
దేశంలో ఒకే రోజు దాదాపు 1.7 లక్షల కరోనా కేసులు నమోదవడం.. మరోసారి కొవిడ్ ఆంక్షలు కఠినతరం చేయొచ్చన్న అంచనాలను బలపరిచింది. దీనితో మదుపరులు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగానూ సానుకూల పవనాలు లేకపోవడం వల్ల మార్కెట్లు ఈ స్థాయిలో పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక, లోహ షేర్లు నష్టాలకు ప్రధానంగా కారణమయ్యాయి.
సోమవారం సెషన్ ప్రారంభమైన గంటలోపే బీఎస్ఈ మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,956 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,693 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,652 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,248 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
డాక్టర్ రెడ్డీస్ (దాదాపు 5 శాతం) మినహా.. 30 షేర్ల ఇండెక్స్లోని కంపెనీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఎం&ఎం, టైటాన్ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. సియోల్ సూచీ మాత్రం లాభాలను గడించింది.
ఇదీ చదవండి:పసిడిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?