కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ఇంటి నుంచి పని, ఆన్లైన్ తరగతుల బోధన కారణంగా కనెక్షన్ల డిమాండ్ 40 శాతం పెరిగింది. తరగతుల సంఖ్య పెరగడం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉన్నవారు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. లాక్డౌన్ కన్నా ముందుతో పోల్చితే ప్రస్తుతం రోజువారీ సగటు డేటా వినియోగం 25 శాతం పెరగడం గమనార్హం. జీహెచ్ఎంసీ, ఇతర ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో డేటా కనెక్షన్లకు గిరాకీ పెరిగింది.
నెల అద్దె రూ.299 నుంచి మొదలు
ఆన్లైన్ తరగతుల కోసం టెలికం సేవాసంస్థల బ్రాడ్బ్యాండ్ అద్దె రూ.299 నుంచి మొదలవుతోంది. ఇంటర్నెట్ వేగం, సామర్థ్యం మేరకు ధరలున్నాయి. గరిష్ఠ డేటా వినియోగం దాటిన తరువాత 512 కేబీ నుంచి 2 ఎంబీపీఎస్ వేగం కల్పిస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల కోసం సగటున నెలకు కనీసం 200 నుంచి 350 జీబీ డేటా వినియోగ సామర్థ్యం కలిగిన కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఇందుకు అద్దె రూ.500 నుంచి రూ.699 వరకు అవుతోంది. డేటావేగం 30 ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ వరకు ఉంటోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని పెరగడంతో డేటా వినియోగం పెరుగుతోందని ఓ టెలికం సేవా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో వారంతాల్లో డేటా వినియోగం ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ రోజుల్లోనూ అదే స్థాయిలో ఉంటోంది.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు