రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న రాసలీలల సీడీ విడుదల చేసిన నిందితుల కోసం దర్యాప్తు దళం అధికారులు గాలింపు తీవ్రం చేశారు. నిందితులు ప్రయాణ సమయంలో తమ చరవాణి నుంచి సిమ్ తొలగించడం, కొత్త సిమ్ కార్డులను వినియోగించడంతో వారి జాడను గుర్తించలేక పోతున్నారు. వీడియోను అంతర్జాలంలోకి అప్లోడ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు బస్సుల్లోనే సంచరిస్తున్నారని, ఆయా బస్టాండ్లకు సమీపంలోని హోటళ్లలో బస చేస్తున్నారని గుర్తించారు.
జార్ఖిహోళి మంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం ఇస్తానంటూ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన యువతి, రహస్య కార్యాచరణకు కెమెరా, ఇతర ఉపకరణాలను ఎక్కడ కొన్నారో తెలుసుకునే ప్రయత్నాలను ప్రత్యేక దర్యాప్తు దళం- సిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఏప్రిల్ 17 కన్నా ముందుగానే న్యాయస్థానం ముందు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్కు నేతృత్వం వహిస్తున్న సీనియరు ఐపీఎస్ అధికారి సౌమేంద్రు ముఖర్జీ తెలిపారు.
కొవిడ్తో గోకాక్ తాలూకా వైద్యశాలలో చికిత్స కోసం చేరిన మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళిని బుధవారం డిశ్ఛార్జి చేశాక.. కేసు దర్యాప్తులో ఆయన సహకారంపై అధికారులు దృష్టి నిలిపే అవకాశం ఉంది. ఆయన వారం తరువాత సిట్ ముందు విచారణకు హాజరవుతారని మాజీ మంత్రి తరఫు న్యాయవాది శ్యామ్సుందర్ వెల్లడించారు.
జార్ఖిహోళి కరోనా పేరిట నాటకం ఆడుతున్నారని సీడీ వీడియోలో కనిపించిన యువతి తరఫు న్యాయవాది జగదీశ్ ఆరోపించారు. మాజీ మంత్రికి మద్దతుగా మంత్రులు బసవరాజ బొమ్మై, డాక్టర్ సుధాకర్, భైరతి బసవరాజ్ తదితరులు ప్రకటనలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. జార్ఖిహోళి విచారణకు హాజరైన తరువాత సిట్ తీసుకునే చర్యలకు అనుగుణంగా తాము న్యాయపోరాటం చేస్తామని జగదీశ్ తెలిపారు.
ఇదీ చూడండి: సీడీ కేసు: హైకోర్టు సీజేకు మహిళ లేఖ!