ఉత్తర్ప్రదేశ్ కౌశాంబీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో- ఇసుక లారీ ఢీకొనగా.. 8 మంది మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివాహ వేడుకకు హాజరైన కొంత మంది స్కార్పియోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. జిల్లాలోని కఢదామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవిగంజ్ మహేశ్వరీ అతిథి గృహం సమీపంలో ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వస్తున్న లారీ.. స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మొత్తం 9 మంది ఇసుకలో కూరుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రులకు తరలించారు. అందులో ఆరుగురు ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య