TS HC ON CBI PETITION: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డికి నోటీసూ జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 29కి హైకోర్టు వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డిని 2019 మార్చి 28న ప్రత్యేక దర్యాప్తు సంస్థ(SIT) అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ చేసి 90 రోజులైన సిట్ ఛార్జ్షీట్ వేయకపోవడంతో పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021 అక్టోబర్లో ఎర్ర గంగిరెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) ఛార్జిషీట్ వేసింది. గంగిరెడ్డికి పులివెందుల కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని గతంలో ఏపీ హైకోర్టును సీబీఐ కోరింది. సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన ఏపీ హైకోర్టు గత ఏడాది మార్చి 17న బెయిల్ రద్దుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే వివేకా హత్య కేసు హైదరాబాద్కు బదిలీ అయిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని 2023 జనవరి16న సీబీఐకి సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనతో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
హైకోర్టు నిరాకరణ: పులివెందుల కోర్టు 2019 జూన్లో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గంగిరెడ్డి , ఆయన అనుచరులు సాక్ష్యులను తీవ్రంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని, బెదిరిస్తున్నారని వాదనలు వినిపించింది. బెదిరింపులకు పాల్పడటంతో పలువురు సీఆర్పీసీ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రాలేదని తెలిపింది. అయితే సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐది ఆరోపణలు మాత్రమేనన్నారు. న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇవ్వడానికి మొదట సిద్ధంగా ఉన్న ఇన్స్పెక్టర్ శంకరయ్య , గంగాధర్ రెడ్డి , కృష్ణారెడ్డి తర్వాత విరమించుకుంటే గంగిరెడ్డికి ఏవిధంగా సంబంధం ఉందని ప్రశ్నించారు. అప్రూవర్గా మారిన షేక్ దప్తగిరి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో గంగిరెడ్డి బెదిరించినట్లు ప్రస్తావించలేదని తెలిపారు. సీబీఐ దాఖలు పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. సీబీఐ పిటిషన్ను కొట్టేస్తూ 2022 మార్చి 17 ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయమనడం జరిగిపోయాయి.
ఇవీ చదవండి: