ఆయుధాలను అక్రమంగా తరలించే పాక్ కుట్రను భారత సైన్యం మరోసారి భగ్నం చేసింది. పంజాబ్లోని గురుదాస్పుర్ తాలూకా సలాచ్ గ్రామంలో డ్రోన్ల సంచారం కలకలం రేపింది. వాటిని గమనించిన భద్రతా దళాలు కూల్చేందుకు ప్రయత్నించగా.. అవి అదృశ్యమైనట్టు గురుదాస్పుర్ ఎస్పీ రాజిందర్ సింగ్ సోహాల్ తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటరు దూరంలోని పొలాల్లో డ్రోన్లు జారవిడిచిన హ్యాండ్ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్ని ఒక చెక్కపెట్టెలో ప్యాక్ చేసి ఉన్నట్లు సోహాల్ తెలిపారు.
ఆదివారం ఒక డ్రోన్ ఎగురుతుండటం భారత సరిహద్దు దళం గమనించి కాల్పులు సైతం జరిపింది. అది అదృశ్యమైనా ఆపరేషన్ని కొనసాగించాం. 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం.
-రాజిందర్ సింగ్ సోహాల్, గురుదాస్పుర్ సీనియర్ ఎస్పీ
గత కొద్దికాలంగా ముష్కరులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను చేరవేస్తోంది పాక్. ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో డ్రోన్లు జారవిడిచిన ఏకే-47లు, మెషిన్ గన్లు, భారీ ఆయుధ డంప్, నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:'చైనా దళాల చొరబాటు వార్త అవాస్తవం'