జమ్ముకశ్మీర్ చినాబ్ ఉపనది మరుసుదర్పై నిర్మించనున్న పకల్ దుల్, లోవర్ కల్మయ్ జల విద్యుదుత్పత్తి కేంద్రాల డిజైన్లపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లద్దాఖ్లో నిర్మించబోయే జల విద్యుత్ ప్రాజెక్టుల వివరాలు అందించాలని కోరింది. సింధు నది జలమండలి వార్షిక సమావేశంలో పాక్ ఈ విషయాలను లేవనెత్తింది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం మంగళవారం దిల్లీలో మొదలైంది. చివరిసారిగా ఈ సమావేశం 2018లో జరిగింది.
గతేడాది జరగాల్సిన భేటీ కరోనా కారణంగా రద్దయింది. తాజా భేటీకి భారత సింధు నది కమిషనర్ పీకే సక్సేనాతో పాటు కేంద్ర జలమండలి, కేంద్ర విద్యుచ్ఛక్తి సంస్థ, జాతీయ జల విద్యుచ్ఛక్తి సంస్థల అధికారులు హాజరయ్యారు. పాక్ నుంచి ఆ దేశ సింధు నది కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా నేతృత్వంలోని బృందం పాల్గొంది.
2019లో జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి లద్ధాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ 8 జల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను తమకు అందించాలని పాక్ ఈ భేటీలో కోరింది. ఇరు దేశాల మధ్య 1960లో కుదిరిన సింధు నది ఒప్పందం ప్రకారం ఆ నది జలాలపై భారత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. అయితే అవి పాక్కు అభ్యంతరం లేని రీతిలో ఉండాలి.
ఇదీ చదవండి:సింధు జల వివాదాలపై నేడు భారత్-పాక్ భేటీ